తొండంలేని గణేశుడు.. చేతిలో గొడ్డలి.. ఎక్కడ కొలువయ్యాడంటే.. | Naramukha Ganapati Temple: World’s Only Human-Faced Ganesha in Tamil Nadu | Sakshi
Sakshi News home page

తొండంలేని గణేశుడు.. చేతిలో గొడ్డలి.. ఎక్కడ కొలువయ్యాడంటే..

Aug 27 2025 8:52 AM | Updated on Aug 27 2025 10:26 AM

Only Ganesha Temple with a human face

వినాయకుడు.. అనగానే ఎవరికైనా ముందుగా పెద్ద బొజ్జ, తొండంతో కూడిన విచిత్ర ఆకృతి గుర్తుకు వస్తుంది. అయితే దీనికి భిన్నంగా మానవముఖంతో ఉండే ఏకైక వినాయక ఆలయం ఎక్కడుందో తెలుసా? వినాయక చవితి వేళ ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. భక్తులు విఘ్నేశ్వరుని దర్శనం కోసం బారులు తీరుతారు.

తమిళనాడులోని తిలతర్పణపురిలో నరముఖ గణపతి ఆలయం ఉంది. కూతనూరు పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆది వినాయక దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.  మానవముఖం కలిగిన ఏకైక వినాయక ఆలయంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. విఘ్నేశ్వరునికి ఏనుగు తల పెట్టకముందు గణేశుని అసలు ముఖం ఇదేనని భక్తులు నమ్ముతారు. ఇక్కడ గణపతిని నరముఖ వినాయకునిగా పూజిస్తారు. ఈ విగ్రహం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. నడుము చుట్టూ నాగాభరణం  కనిపిస్తుంది.

గ్రానైట్ తో నరముఖ గణపతి విగ్రహాన్ని రూపొందించారు.  ఈ గణపతి.. గొడ్డలిని చేతితో పట్టుకుని దర్శనమిస్తాడు. మరోచేతిలో మోదకం ఉంటుంది. ఈ విగ్రహాన్ని 7వ శతాబ్దంలో తీర్చిదిద్దారని నమ్ముతారు. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. పురాణాలలోని వివరాల ప్రకారం గణేశుడిని పార్వతీదేవి సృష్టిస్తుంది. ఆ తర్వాత జీవం పోస్తుంది. పార్వతీదేవి ఒకరోజు స్నానానికి వెళ్లినప్పుడు గణేషుశుడిని తలుపు వద్ద కాపలాగా ఉంచుతుంది.

కొంత సేపటికి శివుడు గృహానికి రాగా, ఆ ప్రాంగణంలోకి వచ్చేందుకు శివుణ్ణి.. వినాయకుడు అనుమతించడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు వినాయకుని తల నరుకుతాడు. విషయం తెలుసుకున్న పార్వతి.. శివునిపై ఆగ్రహిస్తుంది. అప్పుడు దేవతలంతా సమావేశమై, మానవముఖానికి బదులుగా పార్వతి తనయునికి ఏనుగు తలను పెట్టి బతికిస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement