తొండంలేని గణేశుడు.. చేతిలో గొడ్డలి.. ఎక్కడ కొలువయ్యాడంటే.. | Naramukha Ganapati Temple: World’s Only Human-Faced Ganesha in Tamil Nadu | Sakshi
Sakshi News home page

తొండంలేని గణేశుడు.. చేతిలో గొడ్డలి.. ఎక్కడ కొలువయ్యాడంటే..

Aug 27 2025 8:52 AM | Updated on Aug 27 2025 10:26 AM

Only Ganesha Temple with a human face

వినాయకుడు.. అనగానే ఎవరికైనా ముందుగా పెద్ద బొజ్జ, తొండంతో కూడిన విచిత్ర ఆకృతి గుర్తుకు వస్తుంది. అయితే దీనికి భిన్నంగా మానవముఖంతో ఉండే ఏకైక వినాయక ఆలయం ఎక్కడుందో తెలుసా? వినాయక చవితి వేళ ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. భక్తులు విఘ్నేశ్వరుని దర్శనం కోసం బారులు తీరుతారు.

తమిళనాడులోని తిలతర్పణపురిలో నరముఖ గణపతి ఆలయం ఉంది. కూతనూరు పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆది వినాయక దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.  మానవముఖం కలిగిన ఏకైక వినాయక ఆలయంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. విఘ్నేశ్వరునికి ఏనుగు తల పెట్టకముందు గణేశుని అసలు ముఖం ఇదేనని భక్తులు నమ్ముతారు. ఇక్కడ గణపతిని నరముఖ వినాయకునిగా పూజిస్తారు. ఈ విగ్రహం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. నడుము చుట్టూ నాగాభరణం  కనిపిస్తుంది.

గ్రానైట్ తో నరముఖ గణపతి విగ్రహాన్ని రూపొందించారు.  ఈ గణపతి.. గొడ్డలిని చేతితో పట్టుకుని దర్శనమిస్తాడు. మరోచేతిలో మోదకం ఉంటుంది. ఈ విగ్రహాన్ని 7వ శతాబ్దంలో తీర్చిదిద్దారని నమ్ముతారు. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. పురాణాలలోని వివరాల ప్రకారం గణేశుడిని పార్వతీదేవి సృష్టిస్తుంది. ఆ తర్వాత జీవం పోస్తుంది. పార్వతీదేవి ఒకరోజు స్నానానికి వెళ్లినప్పుడు గణేషుశుడిని తలుపు వద్ద కాపలాగా ఉంచుతుంది.

కొంత సేపటికి శివుడు గృహానికి రాగా, ఆ ప్రాంగణంలోకి వచ్చేందుకు శివుణ్ణి.. వినాయకుడు అనుమతించడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు వినాయకుని తల నరుకుతాడు. విషయం తెలుసుకున్న పార్వతి.. శివునిపై ఆగ్రహిస్తుంది. అప్పుడు దేవతలంతా సమావేశమై, మానవముఖానికి బదులుగా పార్వతి తనయునికి ఏనుగు తలను పెట్టి బతికిస్తారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement