రైల్వే నా బిడ్డలాంటిది.. రాజకీయాలకు ఇది సమయం కాదు: మమతా బెనర్జీ

Odisha Train tragedy: Railway Like My Baby Says Mamata Banerjee - Sakshi

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమత్రి మమతా బెనర్జీ ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదని సూచించారు. రైల్వే తన బిడ్డలాంటిదని, దానిలోని లోటుపాట్లను సరిదిద్ధేందుకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షలు రైల్వేశాఖ ప్రకటించిందని, బెంగాల్‌కు చెందిన వారికి తమ ప్రభుత్వం రూ 5 లక్షలు పరిహారం అందించనున్నట్లు తెలిపారు. సహాయక, పునరుద్ధరణచర్యలు పూర్తయ్యే వరకు రైల్వేకు, ఒడిశా ప్రభుత్వానికి పూర్తి సహాకారం అందిస్తామని వెల్లడించారు. అయితే కొరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో యాంటీ కొలిజిన్‌ డివైజ్‌(anti-collusion device) లేదని.. దీనిని అమర్చినట్లయితే.. ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని అన్నారు.
చదవండి: Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఏంటో చెప్పిన రైల్వే శాఖ 

‘నేను చూసిన వాటిలో 21వ శతాబ్దపు అతిపెద్ద ఘటన ఇది. ఇలాంటి కేసుల్ని రైల్వే సేఫ్టీ కమిషన్‌కు అప్పగించాలి. వారు విచారణ జరిపి నివేదిక ఇస్తారు. నేను రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో యాంటీ కొలిజిన్‌ డివైజ్‌ను తీసుకొచ్చాను. ఇది ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ప్రయాణిస్తున్న సమయంలో రైళ్లను నిర్ణిత దూరంలోనే ఆపేందుకు ఉపయోగపడుతుంది. కోరమాండల్‌ రైలులో అలాంటి పరికరం లేదు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం ద్వారా ఈ సంఘటనను నివారించవచ్చు’ అని పేర్కొన్నారు. కాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఎదుటే మమతా ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా మమతా బెనర్జీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వంలో చేరారు.  1999లో అటల్‌ బిహార్‌ వాజ్‌పేయ్‌ కేబినెట్‌లో మొదటిసారి రైల్వేమంత్రిగా పనిచేశారు. 2000లో తొలిసారి రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ సమయంలో పశ్చిమబెంగాల్‌కు అనేక కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తీసుకొచ్చారు. 2009 మేలో యూపీఏ-2 ప్రభుత్వంలో మరోసారి రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పశ్చిమ బెంగాల్‌కు సీఎంగా ఎన్నికవ్వడంతో 2013లో కేంద్ర మంత్రిత్వ  పదవికి రాజీనామా చేశారు. 

కాగా శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో అనూహ్య రీతిలో మూడు రైళ్లు ఢీ కొన్న సంగతి తెలిసిందే. షాలిమార్‌- చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, ఓ గూడ్సు రైలు ప్రమాదానికి గురయ్యాయి. కొన్ని బోగీలు గాల్లోకి లేచి పట్టాలపై పడ్డాయి. ఒక బోగీపై మరొకటి దూసుకెళ్లడంతో వాటికింద ప్రయాణికులు నలిగిపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 280 మందికి పైగా మృతి చెందగా.. 900 మంది గాయపడ్డారు.
చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: తెలుగు ప్రయాణికుల కోసం హెల్ప్‌ లైన్లు ఇవే 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top