దేశ రాజధానిలో ఘనంగా ఈద్‌ వేడుకలు | Eid Moon Seen People Hugged | Sakshi
Sakshi News home page

Delhi: దేశ రాజధానిలో ఘనంగా ఈద్‌ వేడుకలు

Apr 11 2024 7:36 AM | Updated on Apr 11 2024 7:39 AM

Eid Moon Seen People Hugged - Sakshi

దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు వివిధ మసీదులలో నమాజ్‌ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదుకు ముస్లింలు నమాజ్ చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత బుధవారం సాయంత్రం ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈద్ జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపూర్‌ మసీదు ఇమామ్‌లు చంద్రుని దర్శనాన్ని ధృవీకరించారు. చంద్రుడిని చూసిన తర్వాత ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 

ఫతేపూర్‌ మసీదు షాహీ ఇమామ్ మౌలానా ముఫ్తీ ముకర్రమ్ అహ్మద్..  ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశానికి శాంతి, సామరస్యం సమకూరేందుకు ప్రార్థనలు చేయాలని ప్రజలను కోరారు. కాగా చంద్రుడు కనిపించినంతనే ఢిల్లీ ఎన్‌సీఆర్‌ అంతటా అభినందనల పరంపర మొదలైంది. ఫోన్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు  తెలియజేసుకున్నారు.

ముస్లింలు ఈద్ కోసం  పెర్ఫ్యూమ్, క్యాప్స్, డ్రై ఫ్రూట్స్  పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. పాత ఢిల్లీతో పాటు, జామియా నగర్, సీలంపూర్, జాఫ్రాబాద్, నిజాముద్దీన్ సహా ఇతర మార్కెట్లలో రద్దీ పెరిగింది. రాత్రంతా  ఇదే పరిస్థితి కొనసాగింది. ఈద్‌ వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement