
వలస జిల్లాకే.. వలసలు
కృష్ణా: ఒకప్పుడు వలస కార్మికులకు పుట్టినిల్లుగా పేరుగాంచింది నారాయణపేట జిల్లా. బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని ముంబాయి.. పూణె.. తదితర మహానగరాలకు వలస వెళ్లేవారు ఇక్కడి ప్రజలు. నేడు సీన్ రివర్స్ అయ్యింది. ప్రాజెక్టులు.. సాగునీటి కాల్వల పుణ్యమా అని ప్రతి ఎకరా సాగులోకి రావడం.. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండడంతో ఇప్పుడు జిల్లాకే ఇతర రాష్ట్రాల కూలీలు ఉపాధి కోసం వలస వస్తున్నారు. మహారాష్ట్ర, యూపీ ప్రజలు కూడా ఇక్కడి పనుల కోసం వలస రావడం గమనార్హం. ఇదిలా ఉండగా కృష్ణా, బీమా నది పరివాహక ప్రాంతంలోని రైతులు గత వారం రోజుల నుంచి వరినాట్లు ప్రారంభించారు. నెల రోజుల నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున కృష్ణానది నిండుగా ప్రవహిస్తుంది. దీంతో ఇక్కడి రైతులు పంటల సాగుకు నీటి ఇబ్బందులు ఉండవని భావించి వరినాట్లు వేసే పనులు ముమ్మరం చేశారు. ప్రస్తుతం కృష్ణా, భీమా నదీ తీరాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు పొలాలను సిద్ధం చేశారు. ఈ పరిస్థితులలో ఇక్కడున్న కూలీలు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రైతులు తీసుకొస్తుంటారు. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కృష్ణా రైల్వే స్టేషన్కు చేరుకొని అక్కడి నుంచి వలస కూలీలు గుడెబల్లూర్, టైరోడ్, ముడుమాల్, తంగిడి, గుర్జాల్ తదితర గ్రామాలకు ప్రత్యేక వాహనాల్లో వ్యవసాయ పనులకు తరలి వస్తున్నారు.
నదీతీర ప్రాంతాల్లోని సాగు పనులకు కూలీలు
ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర నుంచి వందలాది మంది రాక
జిల్లాలో నెల రోజులపాటు కొనసాగనున్న వ్యవసాయ పనులు

వలస జిల్లాకే.. వలసలు