
ఎన్ఎంసీ మార్గదర్శకాలు పాటించాలి
నారాయణపేట: నేషనల్ మెడికల్ కౌన్సిల్ ( ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా నారాయణపే ట మెడికల్ కళాశాలలో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ వసం వెంకటేశ్వర రెడ్డి సూచించారు. శనివారం నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి వద్ద గల ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి తనిఖీ చేశారు. ముందుగా జిల్లా ఆస్పత్రి లోని అత్యవసర విభాగం, జనరల్ వార్డు, ఐసీయూ, జనరల్ మందుల విభాగాలను పరిశీలించారు. జనరల్ వార్డు లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఆస్పత్రి లో ఉన్న వసతి సౌకర్యాలు, అవసరమైన వసతులు, ఖాళీ పోస్టుల తదితర అంశాలను వివరించారు. జిల్లా జనాభా, మెడికల్ కళాశాల పరిధి, జిల్లా ఆస్పత్రి విస్తీర్ణం, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ల వివరాలు, సర్జరీలు, ఎన్ని జరుగుతాయో సరాసరి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటెన్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కళాశాల, జిల్లా ఆస్పత్రికి ఇంకా ఏయే వసతులు, వైద్య పరికరాలు, యంత్రాలు అవసరమో గుర్తించి సమగ్ర నివేదిక అందజేయాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్కు సూచించారు. విద్యార్థులకు అనుగుణంగా ఆచార్య పోస్టులు అవసరం, పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు, అందుబాటులోని వసతులు, కొత్తగా సమకూర్చాల్సిన వసతుల నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి రెండు రోజుల్లోగా ప్రతిపాదనలు పంపుతానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేష్, వైద్య నిపుణులు ఆదిత్య, టీజీ ఎమ్ఐడిసి డీ.ఈ. కృష్ణ మూర్తి, ఏ ఈ సాయి మురారి పాల్గొన్నారు.