
చేయండి.. చేస్తాం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇందిరమ్మ పథకంలో అప్పట్లో ఇళ్ల స్థలాలు మనమే ఇచ్చాం.. ఇప్పుడు కూడా మనమే ఇస్తున్నాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణాల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది ? ముందస్తుగా వర్షాకాలం వచ్చింది. ఇప్పటికే హెచ్చరించినా సరైన ప్రణాళిక లేకపోవడం ఏమిటి ? భూభారతి చట్టం వచ్చినా.. అప్పీలేట్ అధికారం ఇచ్చినా.. రైతులను తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ చుట్టూ తిప్పించుకోవడం కరెక్టేనా? అంటూ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశ్నల వర్షం కురిపించడంతో అధికారులు కంగుతిన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ వేదికగా మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల అధికారులతో సమీక్షలో.. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రశ్నలకు వివిధ శాఖలకు చెందిన అధికారులు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలినట్లు సమాచారం. ఈ క్రమంలో ‘ప్రభుత్వం అమలు చేస్తున పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చేయడం అధికారుల బాధ్యత’ అంటూ మంత్రులు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టండి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించండి.. వానాకాలం సాగులో ఇబ్బందులు తల్తెకుండా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోండి అంటూ మంత్రులు సూచనలు చేయడం.. ఒకే సార్ అనే సమాధానాలకే పలువురు అధికారులు పరిమితం కావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సమీక్షకు పలువురు విభాగాధిపతులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆయా శాఖల ఉద్యోగ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. సమీక్ష సమావేశంలో మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, పరిగి ఎమ్మె ల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, అనిరుధ్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, వాకిటి శ్రీహరి, డాక్ట ర్ చిట్టెం పర్ణికారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మహబూబ్నగర్, నారాయణపేట జి ల్లాల కలెక్టర్లు విజయేందిర బోయి, సిక్తా పట్నాయక్, మహబూబ్నగర్ జిల్లా అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.
ఎవరెవరు ఏం మాట్లాడారంటే..
● గతంలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చైర్మన్గా ప్రభుత్వ భూముల పంపిణీకి ఒక అసైన్డ్ కమిటీ ఉండేదని, మళ్లీ ఆ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రులను మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి కోరారు.
● యాసంగిలో ఎంత మంది రైతుల వద్ద ఎంత ధాన్యం కొనుగోలు చేశారు.. ఎంత మందికి బోనస్ వచ్చింది.. పంట నష్టం ఎంత జరిగింది.. వచ్చిన నష్ట పరిహారం వివరాలను నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు అందజేసేలా చూడాలని మంత్రులను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఇవ్వాలని వారు అధికారులను ఆదేశించారు.
● కోయిల్కొండ సీహెచ్సీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
● బేస్మెంట్ వేసుకున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింప చేయాలని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి కోరారు.
● గతేడాది మహబూబ్నగర్ జిల్లాలో డెంగీ కేసులు అధికంగా నమోదు కాగా.. ఈ సారి ముందస్తుగానే వార్డుల వారీగా దోమల నివారణకు ఫాగింగ్ చేయించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి మంత్రులకు తెలిపారు. మహబూబ్నగర్తోపాటు నారాయణపేట జిల్లాలోనూ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ ఫాగింగ్ యంత్రాలు లేవని కలెక్టర్లు వారి దృష్టికి తీసుకొచ్చారు. జూన్ మొదటి లేదా రెండో వారంలో వైద్య, ఆరోగ్యశాఖపై నారాయణపేట, మహబూబ్నగర్లలో ప్రత్యేక సమీక్ష చేయనున్నట్లు దామోదర తెలిపారు. కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించే రిపోర్ట్లను ఆయా జిల్లాల శాసనసభ్యులకు కూడా పంపించాలని మంత్రి సూచించారు.
నకిలీ విత్తన అమ్మకందారులపై ఉక్కుపాదం మోపాలి..
టాస్క్ఫోర్స్ బృందాలతో విస్తృత తనిఖీలు చేపట్టి.. నకిలీ విత్తనాలు అమ్మేవారు, రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మన ప్రభుత్వం వచ్చాకే వరికి బోనస్ ఇస్తున్నాం. ఆ క్రెడిట్ మన ప్రభుత్వానికే దక్కాలి. సీఎమ్మార్ బకాయిలను రికవరీ చేసేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఆయా భూముల వివరాలపై సమాచారం అందించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. టోల్ ఫ్రీ నంబర్, వాట్సప్ నెంబర్లు ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలి.
– జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి
రీజినల్ కేన్సర్, ఆర్గాన్ రిట్రివల్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం..
మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎంఆర్ఐ త్వరలో ఏర్పాటు చేయిసాం. సిటీ స్కాన్ కూడా ఏర్పాటు చేస్తాం. జాతీయ రహదారిపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ట్రామా సెంటర్, మహబూబ్నగర్ లో రీజినల్ కేన్సర్ సెంటర్, ఆర్గాన్ రిట్రివల్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం.
– దామోదర రాజనర్సింహ,
జిల్లా ఇన్చార్జి మంత్రి
●
2 జిల్లాల అధికారులతో సమీక్ష సాగిన తీరు ఇది..
మంత్రుల ప్రశ్నలకు నీళ్లు నమిలిన పలు శాఖల అధికారులు?
సూచనలతో సరిపెట్టిన అమాత్యులు
పలు ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై విమర్శలు