
విషాదం మిగిల్చిన విహారయాత్ర
ఎర్రవల్లి: విహారయాత్ర ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం మునగాల సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్ వివరాల మేరకు.. హైదరాబాద్లోని నిజాంపేటకు చెందిన ఎర్ర వెంకటబాబ్జి ఓ కంపెనీలో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 24న తన భార్య ఎర్ర శ్రావణి (38), పెద్ద కుమార్తె లక్ష్మీసహస్ర, చిన్న కుమార్తె సాయిచైత్ర (7)లతో కలిసి తమ కారులో విహారయాత్ర నిమిత్తం ఊటీకి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ సంతోషంగా గడిపారు. గురువారం తెల్లవారుజామున తిరిగి తమ స్వగ్రామానికి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలోని మునుగాల శివారులో జాతీయ రహదారిపై ఎలాంటి సూచికలు లేకుండా నిలిపిన లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా.. వెంకటబాబ్జి భార్య ఎర్ర శ్రావణికి తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందింది. తీవ్రంగా గాయపడిన చిన్న కుమార్తె సాయిచైత్రను కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన వెంకటబాబ్జి, లక్ష్మీసహస్రలను చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వెంకటబాబ్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఎన్హెచ్–44పై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
ప్రమాదంలో తల్లీకూతురు దుర్మరణం
ప్రాణాలతో బయటపడిన తండ్రి, మరో కూతురు
తిరుగు ప్రయాణంలో చోటు చేసుకున్న ఘటన

విషాదం మిగిల్చిన విహారయాత్ర

విషాదం మిగిల్చిన విహారయాత్ర