
సందర్శకులతో జూరాల కిటకిట
ధరూరు: నైరుతి రుతు పవనాల రాకతో జిల్లాలో వర్షాలు విస్తృంగా కురుస్తుండడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ సీజన్లో ప్రాజెక్టుకు మొదటి సారిగా వరద నీరు రావడం.. అదే రోజు గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ అందాలను వీక్షించేందుకు జిల్లా నలుమూలలతో పాటు కర్ణాటక, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. దీంతో శుక్రవారం ప్రాజెక్టు పరిసరాలు సందర్శకులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా చిన్నారులు, యువత సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉదయం నుంచి ప్రాజెక్టు వద్ద గద్వాల, వనపర్తి జిల్లాలకు చెందిన పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాదభరిత ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా కంచె వేశారు.
కృష్ణానదిలో పెరుగుతున్న నీటిమట్టం
కొల్లాపూర్: ఎగువ నుంచి వరద జలాలు రావడంతో కృష్ణానదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం బేసిన్కు 80 వేల క్యూసెక్కుల మేరకు నీటిని విడుదల చేయడంతో బ్యాక్ వాటర్ లెవెల్స్ శుక్రవారం నాలుగు అడుగుల మేరకు పెరిగింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 821 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే త్వరలోనే సంగమేశ్వరుడి ఆలయం మళ్లీ నీటిలో మునిగిపోనుంది. ఈ ఏడాది మార్చి 21 నుంచే సంగమేశ్వర ఆలయంలో పూజలు ప్రారంభయ్యాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే గుడి వద్దకు నీళ్లు చేరుకోవడం ఇదే తొలిసారని పూజారులు, స్థానికులు చెబుతున్నారు.
సంగమేశ్వర గుడి సమీపంలో కృష్ణానది నీటిమట్టం

సందర్శకులతో జూరాల కిటకిట