5.98 కోట్ల చేప పిల్లలు
జిల్లాకు 5.98 కోట్ల ఉచిత చేప పిల్లలు మంజూరయ్యాయి. ఆదివారం నకిరేకల్లోని పెద్ద చెరువులో చేప పిల్లలను పోస్తాం. జిల్లాలో నిండిన అన్ని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో చేపపిల్లలను పోయడం ద్వారా మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుంది. నాణ్యమైన పిల్లలను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
– రాజారాం, మత్స్యశాఖ జిల్లా అధికారి
నల్లగొండ టూటౌన్ : మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీకి జిల్లా యంత్రాంగం ముహూర్తం ఫిక్స్ చేసింది. జిల్లాకు 5.98 కోట్ల చేప పిల్లలు కావాలని మత్స్య శాఖ అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఈనెల 2వ తేదీన నకిరేకల్ పట్టణంలోని పెద్ద చెరువులో చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నకిరేకల్లో ఎమ్మెల్యే వేములు వీరేశం చెరువులో చేపపిల్లలు పోయనున్నారు. ఇందుకోసం జిల్లా మత్స్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ముందుగానే జలకళ
జిల్లా వ్యాప్తంగా డిపార్ట్మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామ పంచాయితీ చెరువులు, కుంటలు కలిపి మొత్తం 1160కి పైగానే ఉన్నాయి. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం, రిజర్వాయర్లకు వరద పోటెత్తడంతో ఆగస్టు నెలాఖరులోనే అన్ని చెరువులు, కుంటలు నిండాయి. కానీ చేప పిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఆలస్యం అయింది.జిల్లాలోని అన్ని చెరువులు, జలాశయాల్లో మత్స్యకార సొసైటీల ద్వారా చేప పిల్లలను వదలనున్నారు.
260 సహకార సంఘాలు
జిల్లా వ్యాప్తంగా 260 వరకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, అందులో 28 వేల మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. సొసైటీల్లో సభ్యత్వం ఉన్న వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 55 వేల నుంచి 60 వేల మంది వరకు ఉచిత చేపపిల్లల పంపిణీ ద్వారా లబ్ధి చేకూరనుంది. నిండిన అన్ని చెరువులు, రిజర్వాయర్లు, కుంటల్లో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం బావిస్తోంది. జిల్లాలోనే అతి పెద్ద రిజర్వాయర్లు అయిన నాగార్జునసాగర్, డిండి, పెద్దదేవులపల్లి, మూసీ, అయిటిపాముల, కనగల్ జలాశయాల్లో కూడా ఉచిత చేప పిల్లలను వదలనున్నారు.
ఆలస్యంగా మొదలవుతున్న ప్రక్రియ..
ఈ ఏడాది ముందుగానే వర్షాలతో కురిసి రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినా.. ఉచిత చేప పిల్లల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోలేదు. ఇక, టెండర్ల ప్రక్రియలో గుత్తేదారులు మొదటిసారి పాల్గొనకపోవడం కారణంగా చేప పిల్లల పంపిణీ ఆలస్యమయ్యింది. వరుణుడు ముందుగానే కరుణించిగా ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని చెరువులు, కుంటల్లో మార్చి వరకు మాత్రమే నీరు ఉంటుంది. ఆ తరువాత నీరు తగ్గుతుందని అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే.. ఎనిమిది నెలల నుంచి ఒక సంవత్సరం పాటు నీటిలో ఉంటేనే చేప పిల్లలు తగిన స్థాయిలో బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందుగానే చెరువుల్లో నీరు తగ్గితే పెద్దగా ప్రయోజనం ఉండదు.
చెరువుల్లో పోసేందుకు ప్రణాళిక
ఫ రేపు నకిరేకల్ పెద్ద చెరువులో చేపపిల్లలు వదలనున్న ఎమ్మెల్యే వీరేశం
ఫ నెల రోజుల్లోగా అన్ని చెరువుల్లోకి
చేరనున్న చేపపిల్లలు


