నేషనల్‌ అవార్డ్‌ వచ్చినా సరే చెత్తకుండిలో పడేస్తా : విశాల్‌ | Actor Vishal comment on national awards | Sakshi
Sakshi News home page

నేషనల్‌ అవార్డ్‌ వచ్చినా సరే చెత్తకుండిలో పడేస్తా : విశాల్‌

Oct 19 2025 1:59 PM | Updated on Oct 19 2025 2:35 PM

Actor Vishal comment on national awards

నటుడు విశాల్‌కు తమిళ, తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. ఈ ఏడాదిలో మదగజరాజ చిత్రంతో భారీ విజయాన్ని  అందుకున్నారు. ఆపై నటి ధన్సికతో నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలోనే  కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం మకుటం చిత్రం కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు రవి అరసుతో పలు విభేదాలు రావడంతో ఈ మూవీని తానే తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఒక పాడ్‌కాస్ట్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు.  అయితే,  అవార్డ్స్‌ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ​్‌లో దుమారం అవుతున్నాయి.

సినిమా, నటీనటులకు వచ్చే అవార్డ్స్‌ గురించి విశాలు ఇలా అన్నారు. కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో కేవలం  ఏడెనిమిది మంది కలిసి ఒక జ్యురీగా ఏర్పడి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు అంటూ  అవార్డుల కోసం ఎలా ఎంపిక చేస్తారని విశాల్‌ అభిప్రాయపడ్డారు. ఇదంతా నాన్సెన్స్ అంటూనే తనకు  జాతీయ పురస్కారం దక్కినా సరే చెత్తబుట్టలోనే పారేస్తానని ఆ ఇంటర్వ్యూలో అన్నారు. అవార్డుల‌ను తానంతగా నమ్మనని, అవి ప‌నికిరాని విష‌యం అంటూ పేర్కొన్నారు. ఇది కేవ‌లం తనకు అవార్డు రాకపోవడం వల్ల చేస్తున్న కామెంట్‌ కాదన్నారు. ఒకవేళ భవిష్యత్‌లో తనకు అవార్డ్‌ వచ్చినా సరే ఇదే మాటపై కట్టుబడి ఉంటానన్నారు.  నిజ‌మైన గుర్తింపు అనేది ప్రేక్ష‌కుల నుంచి మాత్రమే వస్తుందనే క్లారిటీ తనకు ఉందన్నారు. తాను ఎప్పటికీ అది మాత్రమే నమ్ముతానని విశాల్‌ చెప్పారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

సినిమా కోసం ఎలాంటి స్టంట్స్‌ అయినా సరే తానే స్వయంగా చేస్తానని విశాల్‌ అన్నారు. దీంతో ఇప్పటి వరకు చాలా గాయాలు అయ్యాయి అన్నారు. ఇప్పటివరకూ 119 కుట్లు పడ్డాయని  విశాల్‌ చెప్పారు. తన సినిమాలకు డూప్‌ ఉండరని క్లారిటీ ఇచ్చారు. డూప్‌తో చేయించడం తనకు ఇష్టం లేదన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement