
వినియోగదారులకు అందుబాటులో అండుకొర్రల రొట్టెలు
కర్నూలు(అగ్రికల్చర్): పోషక విలువులు అపారంగా ఉన్న అండుకొర్రలతో రొట్టెలు తయారవుతున్నాయి. అండుకొర్రల రొట్టెలకు వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇప్పటి వరకు అండుకొర్రల అన్నం మాత్రమే తింటున్నాం. తాజాగా అండుకొర్రల రొట్టెలు కూడా అందుబాటులోకి రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సంఘం అధ్యక్షుడు కె.వేణుబాబు ప్రత్యేకంగా చిరుధాన్యాలైన కొర్రలు, అండుకొర్రలు, అరికలు, సామలు, ఊదలు సాగు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సంఘం ద్వారా కలెక్టరేట్ ప్రాంగణంలో మిల్లెట్ కేఫ్ ఏర్పాటు చేయించింది. ఇందులో చిరుధాన్యాలకు చెందిన ఆహారంతో పాటు వివిధ చిరుధాన్యాల తినుబండరాలు అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా అండుకొర్రల రొట్టెలను వినియోగదారులకు అందుబాటులో ఉంచడం విశేషం. కిలో అండుకొర్రల రైస్ ధర రూ.250 ఉంది. కిలో రైస్కు అర కిలో రాయచూరు జొన్నలు కలిపి రొట్టెలు తయారు చేసేందుకు శ్రీకారం చుట్టారు. పోషక విలువలు, విటమిన్లు అపారంగా ఉండటం, రుచి లో కూడా ప్రత్యేకత ఉండటంతో ఈ రొట్టెలను వినియోగదారులు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో రొట్టెను రూ.25 ప్రకారం విక్రయిస్తున్నారు.