
కుష్టు వ్యాధి నివారణ అందరి లక్ష్యం కావాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గీతాబాయి
కంకిపాడు: కుష్టు వ్యాధి నిర్మూలన అందరి లక్ష్యం కావాలని, బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.గీతాబాయి ఆదేశించారు. జాతీయ కుష్టు నివారణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఉప్పలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధి లక్షణాలు కల వారి గుర్తింపుపై శనివారం ఆరోగ్య సిబ్బంది ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.గీతాబాయి మాట్లాడుతూ కుష్టు వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే లక్ష్యంతో ఈనెల 18వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకూ ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపట్టామన్నారు. చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, నొప్పితో కూడిన నరములు, నరముల తిమ్మిర్లు, నొప్పిలేని పుండ్లు మొదలైన లక్షణాలు కలవారిని గుర్తించి ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. వ్యాధి నిర్ధారణ, సకాలంలో వైద్యం అందించటం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఆహార అలవాట్లపై శ్రద్ధ తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. వైద్యాధికారులు డాక్టర్ సంతోష చంద్రిక, డాక్టర్ సుధా ప్రసూజ, డీపీఎంఓ శ్రీనివాసరావు, ఎంపీహెచ్ఈఓ శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పెనమలూరులో...
పెనమలూరు: కుష్టు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టి ప్రజల్లో వ్యాధి పట్ల అవగాహన పెంచాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి.గీతాబాయ్ అన్నారు. పెనమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపేన్(ఎల్సీడీసీ) శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 31వ తేదీ వరకు అన్ని మంచినీటి ట్యాంకులు క్లోరినేషన్ చేయించాలని చెప్పారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి బిజిలీ శ్రీనివాసరావు, వైద్యులు సాయిలత, సుస్మిత, మంజుల, సీహెచ్వోలు కుమార్, లక్ష్మయ్య, బి.శివారెడ్డి, ఆశ, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులతో అప్రమత్తం
లబ్బీపేట(విజయవాడతూర్పు): సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశించారు. ఆమె శనివారం పలు ప్రాంతాల్లో పర్యటించి వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. పోరాటనగర్, కీర్తిరాయునిగూడెంలో జ్వరం కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 9 వైద్య బృందాలు శనివారం 367 ఇళ్లను సర్వే చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ చల్లడంతో పాటు, యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.
ఇబ్రహీంపట్నం పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
ఇబ్రహీంపట్నం పీహెచ్సీని శనివారం డీఎంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో కాన్పు అయిన తల్లి, బిడ్డల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనతరం ఏఎన్ఎంలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి పరిఽధిలో వాంతులు, విరేచనాలు, జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతీబాబు, వైద్యాధికారులు డాక్టర్ పర్హిన్, డాక్టర్ సునీల్, డాక్టర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.

కుష్టు వ్యాధి నివారణ అందరి లక్ష్యం కావాలి