
ప్రతీ రైతుకు గుర్తింపు
● 11 అంకెలతో ‘ఫార్మర్ ఐడీ’ కేటాయింపు ● రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వ్యవసాయ శాఖ ● భూమి, పంటల వివరాలు నమోదు చేస్తున్న ఏఈఓలు
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం రూపొందించిన ‘ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్టుకు జిల్లాలో సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియలో ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన గుర్తింపు నంబర్ కేటాయిస్తారు. రైతులకు ఉన్న భూమి రకం, విస్తీర్ణం, సర్వేనంబర్, పట్టాదార్ పాస్ పుస్తకం నంబర్, పంటల సాగు వివరాలు, వ్యక్తిగత వివరాలను నమోదు చేయనుండగా.. ఇప్పటికే వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈఓ)కు శిక్షణ ఇచ్చారు. దీంతో వారు క్లస్టర్ల వారీగా వివరాల నమోదును ప్రారంభించారు. ఫార్మర్ ఐడీని ఆధార్ కార్డుతో లింక్ చేయనుండగా.. ఒక క్లిక్తో సమస్త సమాచారం అందుబాటులోకి వస్తుంది.
కేంద్ర పథకాల కోసమే..
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల అమలు కోసం ఫార్మర్ ఐడీని రూపొందించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, సాయిల్ హెల్త్ కార్డు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, భారత ఆహార భద్రత మిషన్, రాష్ట్రీయ కృషి వికాస యోజన వంటి పథకాల అమలులో ఈ నంబర్ కీలకం కానుంది. కేంద్ర పథకాలను పారదర్శకంగా అర్హుల దరిచేర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. ప్రతీసారి రైతు భూమి పత్రాలన్నీ తీసుకెళ్లే అవసరం లేకుండా ఈ నంబర్తో అధికారులు తెలుసుకునే వీలవుతుంది. అయితే, రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా తదితర పథకాలకు దీంతో సంబంధం ఉండదని అధికారులు చెబుతున్నారు.
నెల పాటు రిజిస్ట్రేషన్లు
ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నెల పాటు జరుగుతుంది. సోమవారం మొదలుకాగా, జూన్ 5వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా రు. జిల్లాలోని 129 క్లస్టర్లలో ఏఈఓలు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అయితే, ఏఈఓలు వచ్చినప్పుడు అందుబాటులో లేని రైతులు ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం వంటి వివరాలతో సమీపంలోని మీ సేవా కేంద్రంలోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జిల్లాలో 3.51 లక్షల మంది రైతుల ఫార్మర్ ఐడీ జారీ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక్కరోజు వ్యవధిలోనే ఓటీపీ విధానం ద్వారా ఫార్మర్ ఐడీ వస్తుంది.
గుర్తింపు తప్పనిసరి
కేంద్రప్రభుత్వ పథకాలు పొందేందుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి. రైతులు స్వచ్ఛందంగా ఏఈఓలను సంప్రదించి పట్టాదారు పాస్ పుస్తకంతదితర వివరాలు అందిస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏఈఓల ద్వారా లేదా సమీపంలోని మీ సేవా
కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
– ధనసరి పుల్లయ్య,
జిల్లా వ్యవసాయాధికారి
రైతులందరికీ నంబర్
రఘునాథపాలెం: కేంద్రప్రభుత్వం చేపట్టిన ’ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్టులో భాగంగా ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంలో రైతుల వివరాల నమోదును సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఏఓ పరిశీలించారు. ఏఈఓ బాలాబత్తుల శిరణ్మయి, రైతులు పాల్గొన్నారు.

ప్రతీ రైతుకు గుర్తింపు