
అసమ్మతి రణభేరి
సమర్థంగా పనిచేయాల్సిన మంత్రులు, ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన పార్టీ ఎమ్మెల్యేలు.. ఇద్దరూ కూడా ఇప్పుడు అసంతృప్తి మంత్రం పఠిస్తున్నారు. తమకు ప్రాధాన్యత దక్కడం లేదు, పనులు జరగడం లేదని బాహాటంగా ప్రకటించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. వారి బాటలోనే మరికొందరు శాసనసభ్యులు వెళ్తే పుట్టి మునిగే ప్రమాదముందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. దీనికి సిద్దరామయ్య, డీకే శివ ఎలా చెక్ పెడతారో?
సాక్షి, బెంగళూరు: ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని పరిస్థితి ఇది.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలే ప్రభుత్వానికి రెబెల్స్గా మారుతున్నారు. సర్కారుకు కంటి మీద కునుకు లేకుండా చేయాల్సిన ప్రతిపక్ష బీజేపీ పనిని సొంత నేతలే చేస్తుండడం గమనార్హం. మరోవైపు రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ నుంచి మరో ఇబ్బంది సిద్దరామయ్య సర్కారుకు ఎదురవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను గవర్నర్ నిలుపుదల చేస్తున్నారు. ఈ పరిణామాలతో సర్కారు సారథులు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సతమతం అవుతున్నారు. ఒకరకంగా చెయ్యి పార్టీలో సంక్షోభం రేగినట్లు భావిస్తున్నారు. సీఎం సలహాదారుడు బీఆర్ పాటిల్, ఆర్థిక సలహాదారుడు బసవరాజ రాయరెడ్డి, మంత్రి హెచ్కే పాటిల్, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్, తాజాగా రాజు కాగే సొంత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పేల్చుతున్నారు. తద్వారా బీజేపీ పని సులువుతోందని కాంగ్రెస్ విచారిస్తోంది. వీటిని ఎలా సర్దుబాటు చేయాలా? అని కేపీసీసీ చీఫ్తో పాటు డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్, సీఎం సిద్దరామయ్య అంతర్మథనంలో పడ్డారు. బుజ్జగింపుల ద్వారానే దారికి తేవాలి తప్ప భయపెడితే సంక్షోభం మరింత ముదురుతుందని నేతలు చెబుతున్నారు.
పలు ఉదాహరణలు
● ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సుమారు 20 మందికి పైగా మంత్రులు తమ వినతులపై స్పందించడం లేదని ఎమ్మెల్యే బీఆర్ పాటిల్తో పాటు 10 మంది ఎమ్మెల్యేలతో సంతకం చేసిన లేఖ ఒకటి విడుదల అయింది. గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రియాంక్ ఖర్గే, రెవెన్యూ మంత్రి కృష్ణబైరేగౌడపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.
● విద్యుత్ సమస్యల మీద అధికారులు, మంత్రి పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. విద్యుత్ శాఖ మంత్రి కేజే జార్జ్పై పలు ఆరోపణలు చేశారు.
రాజ్భవన్తో ఎలా?
గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ప్రభుత్వం పంపించిన 11 బిల్లులను ఏ గవర్నర్ కూడా తిరస్కరించలేదు. ఈ 11 బిల్లులపై సుదీర్ఘ వివరణ కోరుతూ వాటిని వెనక్కి పంపించారు. ఇందులో 5 బిల్లులు తరువాత పరిష్కారం అయ్యాయి. మిగిలిన ఐదు బిల్లులను రాష్ట్రపతి పరిశీనల కోసం పంపించారు. గ్రామీణాభివృద్ధి విశ్వవిద్యాలయాలు, కేపీఎస్సీ సవరణ బిల్లులను గవర్నర్ తిరస్కరించారు.
00000000000000000000000
వరుసగా ఎమ్మెల్యేల ఆగ్రహ జ్వాలలు
బీఆర్ పాటిల్, రాజు కాగె అసంతృప్తి
మరోవైపు గవర్నర్ కఠిన వైఖరి
సీఎం సిద్దరామయ్యకు దిక్కుతోచని స్థితి
పరిపాలన అస్తవ్యస్తం
నేను రాజీనామా చేస్తా
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే
శివాజీనగర: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అందులోనూ ఉత్తర కర్ణాటక శాసనసభ్యులు తిరుగుబాటుస్వరం పెంచారు. బీ.ఆర్.పాటిల్ వ్యవహారాన్ని మరువకముందే, బెళగావి జిల్లా కాగవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరమగౌడ ఆలాగౌడ (రాజు) కాగే సంచలన హెచ్చరిక చేశారు. అవినీతి గురించి బీ.ఆర్.పాటిల్ చెప్పింది అబద్ధం కాదు, ఆయన నిజమే చెప్పారు అన్నారు. రాజు సోమవారం కాగవాడలో మీడియాతో మాట్లాడుతూ అసంతృప్తిని వెళ్లగక్కారు. నా నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఇచ్చామన్నారు. ఉత్తర్వులు మాత్రం రాలేదు, రాష్ట్రంలో పాలనా వ్యవస్థ సంపూర్ణంగా విఫలమైందని ఆరోపించారు. నేను కాంగ్రెస్ పార్టీకి, అసెంబ్లీకి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. రెండు రోజుల్లో బెంగళూరులో సీఎం సిద్దరామయ్యను భేటీ చేసి రాజీనామా చేసినా ఆశ్చర్యం లేదని చెప్పారు. నా నియోజకవర్గంలో రెండేళ్ల నుంచి అభివృద్ధి పనులు స్తంభించిపోయినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇటువంటి పాలనా వ్యవస్థను చూసి నాకు చాలా బాధగా ఉందన్నారు.

అసమ్మతి రణభేరి

అసమ్మతి రణభేరి

అసమ్మతి రణభేరి