హుబ్లీ: ధార్వాడ జిల్లా కలఘటిగి తాలూకా దేవికొప్ప సమీపంలోని గణిగినగట్టి క్రాస్ వద్ద పెళ్లి జనంతో వెళ్తున్న వ్యాన్ రోడ్డుపక్కన కాలువలోకి దూసుకు పోయింది, ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోయారు. కుందగోళ తాలూకా ఎళివాళ గ్రామవాసి దేవక్క (67), సాత్విక్ (6), కస్తూరవ్వ (55) హుబ్లీ కేఎంసీ ఆస్పత్రిలో మరణించారు.
లక్ష్మవ్వ, శకుంతల, తీవ్రంగా గాయపడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. దేవికొప్ప గ్రామంలో బీరప్ప, రోహిణి అనే జంట పెళ్లికి వెళ్లిన వీరు తిరిగి వస్తుండగా డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ప్రమాదం జరిగింది. ముగ్గురు చనిపోగా, 12 మంది గాయపడినట్లు కలఘటిగి సీఐ శ్రీశైల కౌజలిగి తెలిపారు.
లగ్జరీ బస్సులో గొలుసు చోరీ
మైసూరు: కేఎస్ ఆర్టీసీ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ హ్యాండ్బ్యాగ్లోని సుమారు రూ.2 లక్షల విలువైన 25 గ్రాముల బంగారు గొలుసును దొంగలు చోరీ చేశారు. జిల్లాలోని టీ.నరసిపుర నివాసి తనూజ, దావణగెరెలో బంధువుల ఇంట్లో వేడుక కోసం కుటుంబంతో సహా వెళ్లింది. కార్యక్రమం ముగించుకుని దావణగెరె కేఎస్ఆర్టీసీ ఐరావత బస్సులో మైసూరుకు బయల్దేరింది. బంగారు గొలుసును బాక్సులో పెట్టి వ్యానిటీ బ్యాగ్లో భద్రపరిచింది. మైసూరులో దిగాక చూసుకుంటే గొలుసు కనిపించలేదు. నజరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బస్సులోనే దొంగలు కొట్టేసి ఉంటారని వాపోయింది.