
వక్ఫ్ చట్టానికి సవరణపై నిరసన
హుబ్లీ: కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లుకు తెచ్చిన సవరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత ముస్లిం వ్యక్తిగత న్యాయ మండలి నేతృత్వంలో బీదర్లో భారీ ఆందోళన ర్యాలీ చేపట్టారు. వేలాది మంది ముస్లింలతో ఈ ర్యాలీ జామియా మసీదు నుంచి ప్రారంభమై గవాన్ చౌక్ మీదుగా అంబేడ్కర్ సర్కిల్కు చేరింది. అక్కడ సమావేశమైన నేతలు మాట్లాడుతూ వక్ఫ్ చట్టానికి సవరణ రాజ్యాంగ సిద్ధాంతాలకు వ్యతిరేకం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధార్మిక, సాంస్కృతిక హక్కులను కాలరాస్తోందన్నారు. ఈ చట్టాన్ని దేశంలోని కొన్ని సమాజాలు తిరస్కరిస్తున్నాయన్నారు. ఇస్లాం ధార్మిక విలువలు, సాంస్కృతిక స్వాతంత్య్రం, మత సామరస్యతపై తీరని దాడి అన్నారు. మైనార్టీల హక్కుల ఉల్లంఘన, ముస్లిం సమాజాన్ని బలహీన పరిచేందుకే కేంద్రం ఈ చట్టాన్ని తెచ్చిందన్నారు. వక్ఫ్ ఆస్తులను మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని ఈ సవరణ చేశారన్నారు. కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ దాడిలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రాష్ట్రపతికి రాసిన వినతిపత్రాన్ని ఏడీసీ శివకుమార్కు అందజేశారు.