
అవినీతిపరులతో దేశాభివృద్ధికి అవరోధం
బళ్లారి రూరల్ : ఉగ్రవాదులు అమాయక ప్రజలకు భయభ్రాంతులు కలిగిస్తారు. అదే మన మధ్యలో ముసుగులో ఉన్న అవినీతిపరులు దేశాభివృద్ధికి అవరోధకులని ఉపలోకాయుక్త న్యాయమూర్తి బీ.వీరప్ప తెలిపారు. జిల్లా న్యాయసేవా ప్రాధికార, జిల్లా న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు న్యాయవాదుల సాంస్కృతిక సముదాయ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతిలో పాల్గొని ఆయన మాట్లాడారు. శాసకాంగం, న్యాయాంగం, పత్రికా రంగంలో కూడా అవినీతి పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచించాల్సిన తరుణమని తెలిపారు. ప్రతిభావంతులైన న్యాయవాదులు అవినీతికి విరుద్ధంగా గొంతెత్తాలన్నారు. పల్లెపల్లెకు వెళ్లి పేదలకు, ఆసక్తి ఉన్నవారికి చట్టాలపై జాగృతి కలిగించాలన్నారు. రాజ్యాంగం జాతీయ గ్రంథమైంది. ఇందులోని నిబంధనలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. రాజ్యాంగ రక్షితి రక్షితః అన్న నానుడికి తాను శ్రీకారం చుట్టుతున్నట్లు తెలిపారు. ఉపలోకాయుక్త న్యాయమూర్తి నగరంలోని సిటీ కార్పొరేషన్, కేఎస్ఆర్టీసీ, ప్రభుత్వ జిల్లాసుపత్రి, వసతి నిలయాలు, సబ్ రిజిస్టార్ కార్యాలయం, తాలూకా కార్యాలయాలను పరిశీలించారు. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్కు పైఅధికారులకు సిఫార్సు చేశారు. ఉపలోకాయుక్త వెంట ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
వారు ముసుగులో ఉన్న
ఉగ్రవాదుల్లాంటివారు
దావణగెరెలో ఉప లోకాయుక్త
వీరప్ప ముమ్మర తనిఖీలు