
లారీ పైనుంచి పడి హమాలీ మృతి
ధర్మారం(ధర్మపురి): స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీ మెడవేని రాజేశం(57) సోమవారం రాత్రి లారీ పైనుంచి పడి మరణించినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. లారీలో ధాన్యం లోడ్ చేస్తుండగా డ్రైవర్ గుర్రాల మల్లేశం నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాడు. దీంతో రాజేశం లారీ కిందపడి తీవ్రగాయాలకు గురయ్యాడు. వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం తర్వాత మంగళవారం ధర్మారంలోని రాజేశం ఇంటికి తీసుకు రాగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించారు. దహనసంస్కారాల కోసం రూ.20వేలు సాయం చేశారు. అదేవిధంగా మృతుడి కుటుంబానికి పరిహారం అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్షను ఫోన్లో కోరారు. అదేవిధంగా సింగిల్విండో ద్వారా రూ.5లక్షలు, మార్కెట్ కమిటీ ద్వారా మరో రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పించాలని ఆయన కలెక్టర్కు విన్నవించారు. కుటుంబసభ్యులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని లక్ష్మణ్కుమార్ హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహం, మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ, నాయకులు చింతల ప్రదీప్రెడ్డి, దేవి జనార్దన్, ఓరం చిరంజీవి, కాసాని ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

లారీ పైనుంచి పడి హమాలీ మృతి