
అర్ధంతరంగా తనువు చాలించిన టేకేదారు
ముస్తాబాద్/కరీంనగర్క్రైం: కుటుంబాన్ని పోషించుకునేందుకు దారి తప్పిన ఓ యువకుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. గ్రామస్తులు, మృతుల బంధువుల కథనం ప్రకారం.. ముస్తాబాద్కు చెందిన మహ్మద్ షాదుల్లా(29) కరీంనగర్ జైలులో అస్వస్థతకు గురై మృతిచెందాడు. ఈనెల 18న ట్రాక్టర్ చోరీ సంఘటనలో షాదుల్లా, నరేందర్రెడ్డి, సమీర్ను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జైలుకు ముగ్గురిని తరలించారు. అయితే షాదుల్లా శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. గుండెపోటుతో మృతిచెందినట్లు జైలు అధికారులు సమాచారమందించారు. అయితే షాదుల్లా తండ్రి శర్పోద్దీన్ ఆరు నెలల క్రితం అనారోగ్యానికి గురై మృతిచెందాడు. అప్పటి నుంచి తండ్రి నిర్వహించే బీడీ కంపెనీలో టేకేదారుగా షాదుల్లా పని చేస్తున్నాడు. ఈజీ మనీ కోసం స్నేహితుల సహవాసంతో ఐకేపీలో ట్రాక్టర్ను అపహరించిన ఘటనలో షాదుల్లాను పోలీసులు జైలుకు తరలించారు. షాదుల్లా బెయిల్ కోసం తల్లి ఫర్వీన్, భార్య ప్రయత్నిస్తున్నారు. బయటకు వస్తాడని భావిస్తున్న తరుణంలోనే మృతిచెందడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆరు నెలల క్రితమే శర్పోద్దీన్ మృతిచెందగా.. ఇప్పుడు అన్ని తానై ఆదుకుంటాడనుకున్న షాదుల్లా మృతిచెందడంతో తల్లి ఫర్వీన్, భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కరీంనగర్ జైలులో ముస్తాబాద్ వాసి మృతి
ఆరు నెలల క్రితం అనారోగ్యంతో తండ్రి..