
నమోదులో నిజమెంత?
● కొనసాగుతున్న యూడైస్ ప్లస్ వివరాల పరిశీలన ● ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, సమస్యలపై ఆరా
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలలకు ఏటా నిధులు కేటాయిస్తున్నా.. వసతుల లేమితో పాటు విద్యార్థుల నమోదు, సామర్థ్యాల పెంపు అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈనెల 15నుంచి విద్యాశాఖ ఆధ్వర్యంలో తొలిసారి థర్డ్పార్టీతో సర్వే చేపట్టింది. ఏటా పాఠశాలల యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్(యూ–డైస్ ప్లస్)లో సమగ్ర సమాచారం పొందుపరుస్తారు. ఈ అంశాలను కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఈవోలు పరిశీలించాల్సి ఉంటుంది. ఇది పారదర్శకంగా జరగడం లేదని, వాస్తవ పరిస్థితులకు నివేదికకు తేడా ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా శిక్షణ పొందిన డైట్, సీటీఈ కళాశాల విద్యార్థులు ఈనెల 15నుంచి సర్వే చేపట్టారు. వీరి నివేదిక ఆధారంగా పాఠశాలలకు బడ్జెట్ కేటాయింపులు జరగనున్నాయి.
ఒక్కొక్కరికీ 10 పాఠశాలలు
జిల్లావ్యాప్తంగా 628 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మొదటి దశలో 397 పాఠశాలల్లో 34 మంది డైట్ శిక్షణ టీచర్లతో యూడైస్ ప్లస్ వివరాల పరిశీలన చేపట్టారు. ఒక్కొక్కరికి 10 పాఠశాలలు కేటాయించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీల వివరాలు, వసతులు, ఆధార్ అనుసంధానం, మధ్యాహ్న భోజన పథకం, ఉచి త దుస్తుల పంపిణీ, పాఠ్య పుస్తకాల సరఫరా, క్రీడాస్థలం, అదనపు గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నిచర్, ప్రయోగశాల, గ్రంథాల యం తదితర సదుపాయాలపై వాస్తవికత, నివేదిక వివరాలు పరిశీలిస్తారు. తప్పులుంటే సరిచేయాలని హెచ్ఎంలకు సూచిస్తారు. వీరికి స్థానిక సీఆర్పీలు సహకారం అందిస్తారు.
బయటి వారితో ఎందుకంటే..?
ఏటా ఆయా పాఠశాలల హెచ్ఎంలు యూడైస్ ప్లస్లో తమ స్కూల్ సమాచారం పొందుపరుస్తారు. ఇది పారదర్శకంగా జరగడం లేదు. కొన్ని చోట్ల సదుపాయాలున్నా లేవని, చిన్నపాటి మరమ్మతులతో వినియోగంలోకి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నా.. అసలే లేవంటూ సమాచారం పొందు పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో బయటి వ్యక్తులతో పరిశీలన చేయిస్తే కచ్చితమైన సమాచారం వస్తుందని విద్యాశాఖ భావి స్తోంది. హెచ్ఎంలు ఇచ్చిన నివేదికను, డైట్ విద్యార్థులు గడువులోగా పరిశీలి స్తారు. ప్రక్రియ పారదర్శకంగా కొనసాగనుందని, ఉపాధ్యాయులు సహకరించాల ని జిల్లా సమగ్ర శిక్ష ప్లానింగ్ కో–ఆర్డినేటర్ ఎం.శ్రీనివాస్ వివరించారు.