
ఆర్థిక ఇబ్బందులతో గీతకార్మికుడి ఆత్మహత్య
ఓదెల(పెద్దపల్లి): ఆర్థిక ఇబ్బందులతో శనివారం రాత్రి మండలంలోని పొత్కపల్లికి చెందిన గీతకార్మికుడు సుదగొని తిరుపతి(50) కాజీపేట్– బల్లార్షా సెక్షన్ల మధ్య సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం జీఆర్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ తెలిపిన వివరాలు.. తిరుపతి ఏడేళ్ల క్రితం హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. అప్పుచేసి చిన్నకూతురు వివాహం చేశాడు. అప్పులు చెల్లించక, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ పేర్కొన్నారు.
అనారోగ్యంతో బాలుడు మృతి
మెట్పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి మండలం అల్లూరి సీతారామరాజు తండాకు చెందిన జరుపుల హరిప్రసాద్(12) అనారోగ్యంతో మృతిచెందాడు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి పూర్తి చేసుకున్న హరిప్రసాద్ ఇటీవలే సెలవుల్లో భాగంగా ఇంటికి వెళ్లాడు. శనివారం అనారోగ్యంగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆసుపత్రిలో చూపించారు. మళ్లీ ఆదివారం కడుపులో ఆయాసంగా ఉందని చెప్పడంతో మధ్యాహ్నం మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా, కొద్దిసేపటికే బాలుడు మృతిచెందాడని వైద్యులు తెలిపారు.
చికిత్సపొందుతూ అంగన్వాడీ టీచర్..
హుజూరాబాద్: పట్టణంలోని కుమ్మరివాడలో గల అంగన్వాడీ కేంద్రంలో టీచర్గా పనిచేస్తున్న గన్నారపు సంధ్య(33) చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ఈ నెల 16న సంధ్య అనారోగ్యానికి గురికాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ట్రాక్టర్ ఢీకొని రైతు..
ఓదెల(పెద్దపల్లి): మండలంలోని గుండ్లపల్లె గ్రామానికి చెందిన ఎడెల్లి రాజిరెడ్డి (80) ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్ ఢీకొని మృతిచెందాడు. రాజిరెడ్డి పొలం కోస్తుండగా ఇదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ట్రాలీ వెనుకనుంచి ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పొత్కపల్లి ఎస్సై రమేశ్ తెలిపారు.
యువకుడిపై పోక్సో కేసు?
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపట్ల సిరిసిల్ల పట్టణానికి చెందిన యువకుడు అనుచితంగా ప్రవర్తించడంతో అతడిపై తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు అయినట్లు తెలిసింది. శనివారం యువకుడి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి వెళ్లి యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. కాగా ఈ విషయంపై తంగళ్లపల్లి ఎస్సై రామ్మోహన్ను వివరణ కోరగా.. కేసు నమోదైంది వాస్తవమేనని, పోక్సో చట్టం కావడంతో వివరాలు వెళ్లడించలేమని తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో గీతకార్మికుడి ఆత్మహత్య