
‘జీలుగ’ కోసం బారులు
తాడ్వాయిలో క్యూలో ఉన్న రైతులు
భిక్కనూరు: భూసారం పెంచడానికి ఉపయోగపడే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలకు జిల్లాలో కొరత ఉంది. అరొకరగానే సరఫరా అవుతుండడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంతో పాటు రామేశ్వరపల్లి, జంగంపల్లి గ్రామాల్లోని సింగిల్విండోల్లో విత్తనాలు విక్రయిస్తున్నారని తెలియగానే రైతులు పరుగులు తీశారు. అరగంటలోనే విత్తనాల స్టాక్ పూర్తవడంతో ఆయా విండోల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. అవసరమైన జీలుగ విత్తనాలను తెప్పిస్తామని విండో చైర్మన్లు గంగళ్ల భూమయ్య, నాగార్తి భూంరెడ్డి, గొండ్ల సిద్దరాములు తెలిపారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి: మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయంలో గురువారం జిలుగ విత్తనాలను పంపిణీ చేస్తారని తెలియగానే రైతులు ఉదయం 6 గంటలకే తరలివచ్చారు. అధికారులు వచ్చి వరుసగా రైతులకు విత్తనాలు అందించారు. అయితే సగం మందికి కూడా విత్తనాలు సరిపోలేదు. దీంతో రైతులు నిరాశ చెందారు. రైతులకు సరిపడా విత్తనాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏవో నర్సింలు మాట్లాడుతూ మండలానికి 220 సంచులు మాత్రమే వచ్చాయన్నారు. మరిన్ని విత్తనాల కోసం పైఅధికారులకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.
అరగంటలోనే ఖాళీ అయిన విత్తనాలు
నిరాశలో పలువురు రైతులు