
ఇంక్రిమెంట్ల లొల్లి
● ఆందోళనలో రెగ్యులరైజ్డ్ జూనియర్ లెక్చరర్లు
జగిత్యాల: ఇంటర్ విద్యావ్యవస్థలో అధికారుల వైఖరిని నిరసిస్తూ రెగ్యులరైజ్డ్ జూనియర్ లెక్చరర్లు ఆందోళన బాట పడుతున్నారు. 2023 మే 3న జీవో నంబరు 16 ద్వారా పలు శాఖలకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి పొందిన వారు 2024 మేలో మొదటి ఇంక్రిమెంట్ పొందారు. 2025 మే నెలకు సంబంధించిన ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది.
ఇంక్రిమెంట్ నిలుపుదల
జిల్లా వ్యాప్తంగా 15 జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 138 మంది జూనియర్ లెక్చరర్ల వార్షిక ఇంక్రిమెంట్లు ఆయా ప్రిన్సిపాల్స్ నిలుపుదల చేయడంతో లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకారం వ్యవహరించాల్సి ఉండగా.. కొన్ని జిల్లాల్లో ఇంక్రిమెంట్లు వేయడం, మరికొన్ని జిల్లాల్లో వేయకపోవడం గందరగోళంగా మారింది. జిల్లాలో కూడా అమలు కాకపోవడంతో వారు ఆందోళన బాట పట్టారు.
నోడల్ అధికారికి వినతి
130 మందికి వార్షిక ఇంక్రిమెంట్లు రాక ఇబ్బంది పడుతున్నామని, ఇప్పించేలా చూడాలని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (711) ఆధ్వర్యంలో నోడల్ అధికారి నారాయణకు వినతిపత్రం అందించారు. జగిత్యాలలోని గర్ల్స్, మల్లాపూర్ కళాశాల ప్రిన్సిపాల్స్ మాత్రమే ఇంక్రిమెంట్స్ సబ్మిట్ చేశారని, మిగతా 13 కళాశాలల ప్రిన్సిపాల్స్ నిలిపి వేశారని తెలిపారు. వీలైనంత త్వరగా రెండో వార్షిక ఇంక్రిమెంట్ ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి తిరుపతి, జితేందర్రావు, ఎం.తిరుపతి, రవిప్రసాద్ పాల్గొన్నారు.
ఆరుగురు విద్యార్థులు డిబార్
జగిత్యాల: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్కాపీయింగ్కు పాల్పడుతున్న ఆరుగురు విద్యార్థులను డిబార్ చేసినట్లు నోడల్ అధికారి నారాయణ తెలిపారు. కథలాపూర్ జూనియర్ కళాశాల కేంద్రంలో నలుగురు, కోరుట్ల కళాశాల (బాలురు)లో ఇద్దరిని రాష్ట్రం నుంచి వచ్చిన పరిశీలన బృందం డిబార్ చేసింది. జిల్లా వ్యాప్తంగా 1970 మంది విద్యార్థులకు సోమవారం 1870 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు.