
రైతులకు ఇబ్బంది రానీయొద్దు
● కలెక్టర్ సత్యప్రసాద్
మల్లాపూర్/మెట్పల్లి: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి వెంటవెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మల్లాపూర్ మండలం రాఘవపేట, మెట్పల్లి మండలం కొండ్రికర్ల, వేంపేట గ్రామాల్లోని కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. నిర్వాహకులు కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని, తేమశాతం పరిశీలన, రికార్డుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని పేర్కొన్నారు. సన్నం రకం ధాన్యానికి రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలిపారు. డీఆర్డీవో రఘువరణ్, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వీర్సింగ్, ప్యాక్స్ సీఈవో రమేశ్, రైతులు పాల్గొన్నారు.
పల్లెపల్లెకూ ఆర్టీసీ సేవలు
పెగడపల్లి: రోడ్డు సౌకర్యమున్న ప్రతి గ్రామానికి టీఎస్ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చేందుకు కృషి చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రం నుంచి పెగడపల్లి మండలం నంచర్ల, దీకొండ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలను రాములపల్లి గ్రామంలో గురువారం ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు. రాములపల్లి నుంచి దీకొండ వరకు ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. డిపో మేనేజర్ కల్పన, ఎంఎఫ్ కవిత, ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలి
జగిత్యాల: సీఎంఆర్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో రైస్మిల్లర్లతో సమీక్షించారు. రోజువారి లక్ష్యం ప్రకారం మిల్లుల నుంచి సీఎంఆర్ డెలివరీ చేయించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు.
వేసవి శిబిరాలను వినియోగించుకోవాలి
జగిత్యాల: వేసవి శిబిరాలను వినియోగించుకోవాలని డీఈవో రాము అన్నారు. పురాణిపేట ఉన్నత పాఠశాలలో వేసవి శిబిరాలను గురువారం ప్రారంభించారు. 15ఏళ్లలోపు విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు వేదిక్, గణితం, సంగీతం, ఆటలు, ఇంగ్లిష్, యోగా వంటి అంశాల్లో మెళకువలు నేర్పిస్తారని, స్నాక్స్, తాగునీరు ఉచితంగా అందిస్తారని తెలిపారు. కో–ఆర్డినేటర్లు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
కార్మికుల ప్రయోజనం కోసం ప్రత్యేక చట్టాలు
మెట్పల్లి: కార్మికుల ప్రయోజనం కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని మెట్పల్లి సీనియర్ సివిల్ మేజిస్ట్రేట్ నాగేశ్వర్రావు అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అంతకు ముందు పలువురు న్యాయవాదులు ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ తదితర వాటిపై వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్రెడ్డి, న్యాయవాదులు ఉన్నారు.

రైతులకు ఇబ్బంది రానీయొద్దు

రైతులకు ఇబ్బంది రానీయొద్దు

రైతులకు ఇబ్బంది రానీయొద్దు