
మాస్కో: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యారు. రాజధాని మాస్కోలో జరిగిన ఈ సమావేశంలో భారత్–రష్యా సంబంధాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారంగా భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం టారిఫ్లు విధించిన నేపథ్యంలో పుతిన్తో జైశంకర్ సమావేశమై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పుతిన్తో భేటీ అనంతరం జైశంకర్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉక్రెయిన్ విషయంలో తాజా పరిణామాలను తనతో పంచుకున్నందుకు పుతిన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపానని చెప్పారు. రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంతురోవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో తన భేటీ వివరాలను పుతిన్కు వివరించానని స్పష్టంచేశారు.