Russia Bans Boris Johnson Entry: రష్యా మరో కీలక నిర్ణయం.. తగ్గేదేలే అంటూ ముందుకు..

Russia Bans Entry To UK PM Boris Johnson - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం వేళ రష్యా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌పై ర‌ష్యా నిషేధం విధించింది. బోరిస్ జాన్స‌న్ ర‌ష్యాలోకి రాకుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ది. 

అయితే, ఉక్రెయిన్‌లో యుద్దం జరుగుతున్న సమయంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌.. యుద్ద ప్రభావిత ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో కలిసి అక్కడి పరిస్థితులను ప్ర‍త్యక్షంగా తిలకించారు. ఆ తర్వాత రష్యా దాడులను తీవ్రం ఖండించారు. ఇక, అంతకు ముందే యూరోపియన్ యూనియన్, యూకే.. రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి. రష్యాకు చెందిన 350 మంది వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా రష్యాకు లగ్జరీ వస్తువుల ఎగుమతిని నిషేధించాయి. దీంతో రష్యా.. బ్రిటన్‌పై ఆంక్షలు విధిస్తూ నిర‍్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా ర‌ష్యా విదేశాంగ మంత్రి లిజ్ ట్రాస్ స్పందిస్తూ.. బ్రిట‌న్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో పాటుగా మాజీ ప్ర‌ధాని థెరిసా మే, స్కాట్‌లాండ్ మినిస్ట‌ర్ నికోలా స్ట‌ర్జియ‌న్‌తో పాటు మ‌రో 13 మంది బ్రిటీష్ ప్ర‌భుత్వాధికారుల‌పై నిషేధాన్ని విధిస్తున్న‌ట్లు తెలిపారు. ర‌ష్యా సీనియ‌ర్ అధికారుల‌పై బ్రిట‌న్ చ‌ర్య‌లు తీసుకున్న నేప‌థ్యంలో ర‌ష్యా కూడా ఆంక్షలను విధించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌తో పోరులో రష్యాకు వ్యతిరేకంగా ఉన్నారని పుతిన్‌ ఇప్పటికే అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌, న్యూజిలాండ్‌ ప్రధాని, ఆస్ట్రేలియా ప్రధానితో సహా ఆయా దేశాలకు చెందిన ప్రముఖులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. 

మరోవైపు.. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులను తీవ్రతరం చేశాయి. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లో ఉన్న మిలిట‌రీ ఫ్యాక్ట‌రీపై ర‌ష్యా సైన్యం దాడి చేసింది. హై ప్రిసిష‌న్ మిస్సైళ్ల‌తో 16 శ‌త్రు టార్గెట్ల‌ను ధ్వంసం చేసిన‌ట్లు రష్యా తెలిపింది. కీవ్‌తో పాటు మైకోలైవ్‌లో ఉన్న మిలిట‌రీ సామాగ్రిని రిపేర్ షాపును క్షిప‌ణ‌తో ధ్వంసం చేసినట్టు రష్యా అధికారులు వెల్లడించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top