నైపుణ్యానికి సాన! | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యానికి సాన!

Sep 6 2024 7:32 AM | Updated on Sep 6 2024 7:32 AM

నైపుణ్యానికి సాన!

నైపుణ్యానికి సాన!

సాక్షి, సిటీబ్యూరో: శరవేగంగా విస్తరిస్తున్న సాంకేతిక రంగంలో ఉన్నత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువ ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం ప్రతిభ, నైపుణ్యాలకు సాన పెడుతున్నారు. దీంతో కెరీర్‌లో మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఆయా సంస్థల విలువ మెరుగవుతోంది. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం 83 శాతం జెన్‌–జెడ్‌ యువత వారి నైపుణ్యాభివృద్ధికి మొగ్గు చూపిస్తుందని సింప్లీలెర్న్‌ తాజా అధ్యయనంలో తేలింది.

డేటా సైన్స్‌, ఏఐ కోర్సులలో..

నైపుణ్యాభివృద్ధి కోసం అయ్యే వ్యయాన్ని తల్లిదండ్రులు, ఇతరత్రా మార్గాల ద్వారా కాకుండా సొంత నిధులు, వ్యక్తిగత పెట్టుబడులకే 91 శాతం యువత ఆసక్తి చూపిస్తోంది. నైపుణ్యం మెరుగుపరుచుకోవాలని భావిస్తున్న వారిలో 70 శాతం పురుషులు, 30 శాతం మహిళలు ఉన్నారు. అత్యధికంగా 35.3 శాతం మంది డేటా సైన్స్‌, వ్యాపార విశ్లేషణలో, 33.9 శాతం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మిషన్‌ లెర్నింగ్‌లో, 20.2 శాతం మంది సైబర్‌ సెక్యూరిటీ కోర్సులలో నైపుణ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు.

60 శాతం ఐటీ రంగంలోనే..

10 వేల మంది యువ ఉద్యోగులపై సింప్లీ లెర్న్‌ అధ్యయనం చేసింది. శ్రామికశక్తిలో నైపుణ్యాభివృద్ధికి ప్రేరణ, వారి ప్రవర్తన తదితర అంశాలను విశ్లేషించింది. వీరిలో సుమారు 66 శాతం బ్యాచిలర్స్‌ డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నారు. దాదాపు 60 శాతం మంది ఇప్పటికే ఐటీ రంగంలో ఉపాధి పొందుతున్నారు. 40 శాతం మంది ఐటీయేతర రంగాలలో నిమగ్నమయ్యారు.

జెన్‌–జెడ్‌ అంటే?

18–27 ఏళ్ల వయసు తరాన్ని జెన్‌–జెడ్‌గా పిలుస్తుంటారు. ప్రపంచంలోనే అత్యధిక జెడ్‌–జెడ్‌ యువత మన దేశంలోనే ఉన్నారు. దేశంలోని జనాభాలో 60 కోట్ల మంది 28 ఏళ్ల లోపు యువతే. జెన్‌–జెడ్‌లో నైపుణ్యాలను మెరుగుపర్చడంతో 10 కోట్ల మంది యువ భారతీయులను వర్క్‌ఫోర్స్‌లోకి వస్తారని అంచనా. దీంతో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి చెంది, దేశ ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుతుంది. 2030 నాటికి ప్రపంచ శ్రామిక శక్తిలో 30 శాతం జెన్‌–జెడ్‌ యువతే ఉంటారు.

స్కిల్స్‌తోనే కెరీర్‌లో ఉన్నతావకాశాలు

నైపుణ్యాభివృద్ధిపై యువ ఉద్యోగుల ఆసక్తి

డేటా సైన్స్‌, ఏఐ, మిషన్‌ లెర్నింగ్‌లో శిక్షణ

ఉద్యోగ భద్రతతో పాటు సంస్థ విలువ పెరుగుదల

సంస్థలకు విలువ చేకూరుతుంది

నేటి సాంకేతిక యుగంలో ఉద్యోగుల స్థానం పదిలంగాా ఉండాలంటే నిరంతరం అభ్యాసం తప్పనిసరి. దీంతో డిజిటల్‌ సాధనాలను యువ ఉద్యోగులు కొత్త ఉపాధి మార్గాలుగా ఎంచుకుంటున్నారు. వ్యాపార, విస్తరణ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త సాంకేతికత వీలు కల్పిస్తుంది. ఉద్యోగులలో నైపుణ్యాభివృద్ధి ఆలోచనలు వారు పనిచేసే సంస్థలకు మరింత విలువను చేకూరుస్తుంది.

– కశ్యప్‌ దలాల్‌, సీఈఓ, సింప్లీలెర్న్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement