
ఆస్పత్రి నిర్మాణ నిధుల పెంపుపై విచారణ
హన్మకొండ చౌరస్తా: వరంగల్ నగరంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం ఎలాంటి అప్రూవల్ లేకుండా రూ.600 కోట్లు వెచ్చించినట్లు గత బీఆర్ఎస్ సర్కార్ చెబుతుందని, ఈ అక్రమాలపై ప్రభుత్వం విచారణ కమిటీ వేయనున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రజాభవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎంజీఎం ఆస్పత్రికి ఇకనుంచి వారానికోసారి వెళ్లి వైద్య సదుపాయాలు పరిశీలిస్తూనే అధికారులతో సమీక్షిస్తానని తెలిపారు. హనుమకొండలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ జీఓ విడుదల చేసిందన్నారు. కాకతీయ యూనివర్సిటీ స్థలంలో పెగడపల్లికి వెళ్లే దారిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనం నిర్మించేందుకు అనుకూలంగా ఉందని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. హనుమకొండ చౌరస్తాలో కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. గత సర్కారు హయాంలో నిర్మించిన వెండింగ్ జోన్లను బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకున్నారని, అందుకు సంబంధించిన చిట్టాను త్వరలోనే బయటపెడతానని తెలిపారు. కార్మిక నాయకుడినని చెప్పుకుంటున్న నాయకుడు పదేళ్లలో కార్మిక భవనం ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ప్రశ్నించారు. చేసిన అభివృద్ధిపై మాట్లాడాలని అనేక సార్లు సవాల్ విసిరితే, చేతకాక కోడిగుడ్డుపై ఈకలు పీకే రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు, భవన నిర్మాణానికి నిధులు కేటాయించడంపై సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. సమావేశంలో పీసీసీ సభ్యుడు ఈవీ శ్రీనివాసరావు, గ్రంథా లయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, మున్సిపల్ కా ర్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఇకనుంచి వారానికోసారి
ఎంజీఎం వెళ్తా..
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరుపై
సీఎం రేవంత్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం