
ద్విచక్ర వాహనంపై 109 చలాన్లు
వరంగల్ క్రైం : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి ఏకంగా 109 ఆన్లైన్ చలాన్లు పెండింగ్లో ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడిని మంగళవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన భిక్షపతి తన ద్విచక్ర వాహనం (టీఎస్03 ఈఎస్ 9020)పై వరంగల్ ట్రై సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపటంతోపాటు మరికొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి తిరుగుతున్నాడు. బుధవారం ట్రాఫిక్ సిబ్బంది నగరంలోని అశోక జంక్షన్లో ద్విచక్ర వాహనాల పెండింగ్ చలాన్లు తనిఖీ చేస్తున్న క్రమంలో సదరు వాహనాన్ని ఆపి పోలీస్ వెబ్ పోర్టల్లో తనిఖీ చేశారు. ఆ వాహనంపై ఏకంగా 109 చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు చూపడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. భిక్షపతికి పెండింగ్లో ఉన్న చలాన్ల మొత్తం రూ.26,310 చెల్లిం చాల్సిందేనని రశీదు అందజేశారు. చల్లాన్లు చెల్లించేంతవరకు ద్విచక్ర వాహనం పోలీస్ కస్టడీలో ఉంటుందని వారు తెలిపారు.