
బడిబాటకు వేళాయె..
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహణకు ఉపాధ్యాయులు సన్నద్ధమయ్యారు. నేటి(శుక్రవారం)నుంచి 19వరకు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ పరిధిలోని ప్రాంతాల్లో బడిబాట నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు ఇప్పటికే జారీ అయ్యాయి.
విద్యార్థులు లేని పాఠశాలలను తెరుస్తారు..
హనుమకొండ జిల్లాలో అసలు విద్యార్థులు లేని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 41 ఉన్నాయి. అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గతేడాది విద్యార్థులున్న పాఠశాలలకు సర్దుబాటు చేశారు. ఈ ఏడాది ఆయా పాఠశాలలను తెరిచేందుకు డీఈఓ వాసంతి అవకాశం ఇచ్చారు. 41 పాఠశాలల్లోని టీచర్లు బడిబాట కార్యక్రమం ద్వారా తమతమ ప్రాంతాల పాఠశాలల పరిధిలో విద్యార్థులను నమోదు చేయిస్తే అవే పాఠశాలల్లోనే ఆయా టీచర్లు కొనసాగించేందుకు కూడా నిర్ణయించారు. కనీసం పది మంది విద్యార్థులను చేర్పించిన కూడా ఆయా పాఠశాలలు కొనసాగనున్నాయి. విద్యార్థులను చేర్పించలేని పరిస్థితుల్లో ఆయా పాఠశాలల టీచర్లను విద్యార్థులున్న ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. జిల్లాలో 10లోపు విద్యార్థులున్న పాఠశాలలు మరో 45 వరకు ఉన్నాయి. ఆయా పాఠశాలల టీచర్లు కూడా తమతమ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచుకోవాల్సిందే. 20 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కూడా కొన్నింటిలో తక్కువగానే విద్యార్థులు ఉన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం కలిగించేలా కృషిచేసి విద్యార్థులను చేర్పించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆయా పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని భావిస్తున్నారు.
వరంగల్ జిల్లాలో 126 పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. గతేడాది ఆయా టీచర్లను వేరే పాఠశాలలో సర్దుబాటు చేశారు.విద్యార్థులను చేర్పించని పాఠశాలల టీచర్లకు ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు.
రోజువారీగా కార్యక్రమాలు ఇలా..
● 6న బడిబాటలో భాగంగా గ్రామసభలు, అవగాహన ర్యాలీలు నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాలు ,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు తదితరులను భాగస్వాములను చేయాలి.
● 7న ఇంటింటికి తిరుగుతూ బడిఈడు పిల్లలను గుర్తించాలి. గ్రామ విద్యార్థి రిజిస్టర్ను నవీకరించాలి.
● 8 నుంచి 10వ తేదీవరకు ఇంటింటికివె వెళ్లి ప్రచారం చేయటంతోపాటు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలి. అందులోని బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించేలా ప్రోత్సహించాలి.
● 11న బడిబాట ద్వారా చేసిన ప్రగతిని చర్చించేందుకు గ్రామసభ నిర్వహించాలి.
● 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించి అదే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్ అందించాలి.
● 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలలసభ నిర్వహించాలి.
● 16న ఎఫ్ఎల్ఎన్, లిప్ దినోత్సవం జరపాలి.
● 17న విలీన విద్య, బాలికా దినోత్సవంను నిర్వహించాలి.
● 18 తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన కల్పించి మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని వివరించాలి.
● 19 బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడాపోటీలు నిర్వహించాలి.
విద్యార్థుల నమోదు లక్ష్యం..
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదుకు బడిబాట నిర్వహించాలి. జిల్లా కేంద్రంలోని మడికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ప్రారంభిస్తారు. అక్కడే గ్రామసభ నిర్వహించి, తల్లిదండ్రులను, మహిళా సమాఖ్యలను, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములయ్యేలా చూస్తాం.
– బద్దం సుదర్శన్రెడ్డి, హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్, కోఆర్డినేటర్
నేటినుంచి 19వరకు నిర్వహణ
వివిధ కార్యక్రమాల రూపకల్పన
చివరి రోజు విద్యార్థులకు క్రీడాపోటీలు
జిల్లాల్లో విద్యార్థులు లేని స్కూళ్ల
పునఃప్రారంభానికి ఓకే..
కనీసం పదిమందినైనా చేర్పించాలి..
హనుమకొండలో 41, వరంగల్లో 126 పాఠశాలల్లో సున్నా సంఖ్య
జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు
జిల్లా పీఎస్లు యూపీఎస్లు హైస్కూల్స్
హనుమకొండ 314 72 147
వరంగల్ 321 68 123

బడిబాటకు వేళాయె..

బడిబాటకు వేళాయె..