చెక్బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు
ఏలూరు (టూటౌన్): చెల్లని చెక్కు కేసులో నిందితురాలికి ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు పడమరవీధి గాంధీమైనంలో నివసించే ఆరేపల్లి శ్రీనివాస్ భార్య ఆరేపల్లి సుమలత కుటుంబ అవసరాల నిమిత్తం స్ధానికంగా ఉంటున్న మేడపాటి సుధాకర్రెడ్డి వద్ద 2022 ఏప్రిల్ 20న రూ.6.50 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీర్చే క్రమంలో 2023 మే 5న రూ.5 లక్షల చెక్ను సుధాకర్ రెడ్డికి అందచేశారు. ఆ చెక్ను బ్యాంకులో వేయగా ఖాతాలో నిల్వ లేకపోవడంతో చెల్లుబాటు కాలేదు. దీనిపై సుధాకర్రెడ్డి కోర్టులో కేసు వేశారు. ఏలూరు స్పెషల్ మొబైల్ కోర్టులో మంగళవారం ఈ కేసుకు సంబంధించి తుది విచారణ చేపట్టారు. చెల్లని చెక్ ఇచ్చిన నేరం రుజువు కావడంతో ఆరేపల్లి సుమలతకు ఆరు నెలలు జైలుశిక్ష తో పాటు రూ. 5 లక్షలు చెల్లించే విధంగా తీర్పునిచ్చారు. బాధితులు తరపున న్యాయవాది ఏవీఎస్ సూర్యారావు తన వాదనలు వినిపించారు.
ఏలూరు రూరల్ : ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మంగళవారం దివ్యాంగుల జిల్లాస్థాయి ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మానసిక, శారీరక దివ్యాంగులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. ట్రైసైకిల్, రన్నింగ్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, కేరమ్స్, చెస్ తదితర అంశాల్లో దివ్యాంగులు పోటీ పడ్డారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తేదీన బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. పోటీల ప్రారంభోత్సవానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దివ్యాంగుల సంక్షేమశాఖ జిల్లా అధికారి, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్తో పాటు ఇడా చైర్మన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి పోటీలను ఆరంభించారు. ఈ సందర్భంగా ఏలూరులో దివ్యాంగులకు కోసం కమ్యునిటీహాలు నిర్మించాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు వీరభద్రరావు (వాసు) ఎమ్మెల్యేను కోరారు. ఇటీవల రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన దివ్యాంగుడు మన్విత్ను నిర్వాహకులు సన్మానించారు. హనుమాన్ జంక్షన్, కై కులూరు, ద్వారకాతిరుమల తదితర ప్రాంతాలకు చెందిన పలు స్వచ్చంద సంస్థలకు చెందిన దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కలిదిండి (కై కలూరు): తండ్రి ఆత్మహత్యకు కారణమైన కొడుకును పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. కలిదిండి మండలం పోతుమర్రు శివారు గొల్లగూడెం గ్రామానికి చెందిన కట్టా పెదకృష్ణ (70)ను పెద్ద కుమారుడు సత్యనారాయణ (45) చిత్ర హింసలు పెట్టేవాడు. ఇటీవలే ఓ హత్యకేసులో జైలు శిక్ష అనుభవించి బెయిల్పై విడుదలైన సత్యనారాయణ రోజూ మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులను బాధపెట్టేవాడు. సోమవారం ఇంటికి పెట్రోలు పోయడంతో తండ్రి పెదకృష్ణ భయకంపితుడయ్యాడు. చివరకు తన చావుతోనైనా కొడుకు మారతాడని పెదకృష్ణ ఉరివేసుకుని మరణించాడు. ఈ ఘటనపై తల్లి వీరమ్మ ఫిర్యాదు మేరకు కలిదిండి ఎస్సై వెంకటేశ్వరరావు నిందితుడు సత్యనారాయణను అరెస్టు చేసి కై కలూరు కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారని పోలీసులు తెలిపారు.


