
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
తాడేపల్లిగూడెం అర్బన్: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకొంది. రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత చింతలపూడికి చెందిన కొండమురుగు తేజశ్వి (23) తాడేపల్లిగూడెంలోని మదర్ వన్నినీ నర్సింగ్ స్కూల్లో బీఎస్సీ నర్సింగ్ విద్యను అభ్యసిస్తోంది. తాడేపల్లిగూడెంలోని గొల్లగూడెం ప్రాంతంలో ఉన్న ఎస్సీ హాస్టల్లో నివాసం ఉంటుంది. మంగళవారం ఉదయం 11 గంటల వరకు హాస్టల్లోని తోటి విద్యార్థులతో కలసి మాట్లాడింది. తరువాత 12.30 గంటల సమయంలో తేజస్వీని కనబడకపోవడంతో హాస్టల్ వార్డెన్ సుజాత ఆరా తీయగా హాస్టల్లోని ఎవరూ లేని ఒక గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని కనపించింది. వార్డెన్ సుజాత పెద్దగా కేకలు వేయడంతో తోటి విద్యార్థులు అక్కడకు చేరుకొని తేజశ్విని కిందకు దింపే ప్రయత్నం చేశారు. తేజశ్విని 108 అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తేజశ్వి మృతికి ప్రేమ వ్యవహారం కారణమై ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా తల్లి, అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. రూరల్ ఎస్సై జీవీఎన్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.