
డ్రోన్ సాయంతో జూదరుల గుర్తింపు
ఉండి: ఉండి పట్టణ శివారు పంట పొలాల వద్ద పేకాట ఆడుతున్న 9 మంది వక్తులను డ్రోన్ ద్వారా గుర్తించి, కేసులు నమోదు చేశారు. ఎస్పీ అద్నాన్ నయీం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని శివారు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, జూదం వంటి పలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. అందులో భాగంగా శనివారం ఉండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎండీ నజీరుల్లా, సిబ్బంది డ్రోన్ ద్వారా గస్తీ నిర్వహిస్తున్న సమయంలో కోలమూరు, పాందువ్వ గ్రామాల శివారు నిర్మానుష్య ప్రదేశాలలో పేకాట ఆడుతున్న 9 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి రూ.7,390 నగదు స్వాధీనం చేసుకుని, వారిపై ఉండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.