
రోడ్డు ప్రమాదంలో ర్యాలి వాసి మృతి
● కశింకోటలో ఘోర రోడ్డు ప్రమాదం
● ముందున్న లారీని ఢీకొట్టి ఘటన
● వ్యాన్ డ్రైవర్ సహా మహిళ దుర్మరణం
● మరో మహిళకు గాయాలు
కశింకోట: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం జమాదులపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కోల్కతాకు వెళ్తున్న కంటైనర్ను బొలేరో వ్యాన్ ఢీకొంది. దాంతో వ్యాన్ డ్రైవర్ సహా ఒక మహిళ దుర్మరణం పాలయ్యారు. మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. సీఐ అల్లు స్వామినాయుడు వివరాల ప్రకారం కశింకోట మండలం తీడ గ్రామానికి చెందిన పూల వ్యాపారి కన్నూరు లక్ష్మి(40)తో పాటు మరో మహిళ తూర్పు గోదావరి జిల్లా కడియం వద్ద పూలు కొనుగోలు చేసి గాజువాకలో విక్రయానికి వ్యాన్లో తరలిస్తున్నారు. ఈ క్రమంలో యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న ఈ వ్యాన్ అదే మార్గంలో ముందు వెళ్తూ అకస్మాత్తుగా ఆగిన కంటైనర్ లారీని బలంగా ఢీకొంది. దీంతో కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ పి.సత్యనారాయణ (25), పూల వ్యాపారి లక్ష్మి(40) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అనకాపల్లి మండలం కోడూరుకు చెందిన పూల వ్యాపారి ఎన్.వరలక్ష్మి తీవ్రంగా గాయపడింది. వెంటనే సీఐ స్వామినాయుడు, ఎస్ఐ లక్ష్మణరావులతోపాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వరలక్ష్మిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సలహాపై విశాఖ కేజీహెచ్కు తరలించారు.
కేబిన్లో ఇరుక్కున్న మృతదేహాలు..
ఈ ఘటనలో వ్యాన్ క్యాబిన్ నుజ్జవడంతో అందులో డ్రైవర్, పక్క సీటులో కూర్చున్న లక్ష్మి మృత్యువాత పడ్డారు. పోలీసులు అతి కష్టం మీద వారిని బయటకు తీసి అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

రోడ్డు ప్రమాదంలో ర్యాలి వాసి మృతి

రోడ్డు ప్రమాదంలో ర్యాలి వాసి మృతి