● పురుషులు పంచె, కండువా..
● మహిళలు చీర, జాకెట్టు లేదా పంజాబీ డ్రెస్ చున్నీతో..
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో నిత్యం నిర్వహిస్తున్న నారసింహ సుదర్శన హోమంలో పాల్గొనే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తులను తప్పనిసరిగా ధరించాలని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేవస్థానం కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. పురుషులు పంచె, కండువా, మహిళలు చీర, జాకెట్టు లేదా పంజాబీ డ్రెస్, చున్నీతో పాల్గొనాలన్నారు.
సంప్రదాయ దుస్తులు ధరించడంలో పరమార్థం
దైవ దర్శనం సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించడంలో పరమార్థం గురించి ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు వివరించారు. దేవాలయానికి వెళ్లిన దగ్గర నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చే వరకూ మన దృష్టి దేవుని మీదనే ఉండాలి. అందుకే మన పెద్దలు భక్తులు ధరించే వస్త్రాలు సంప్రదాయ బద్ధంగా ఉండాలనే ఆచారాన్ని పెట్టారని వివరించారు.