బర్త్‌ డే పార్టీలో లొల్లి: బీజేపీ కార్యకర్త దారుణ హత్య | Sakshi
Sakshi News home page

జై శ్రీరామ్‌ అని నినదించడంతో హత్య అని ఆరోపణ

Published Fri, Feb 12 2021 4:43 PM

Birthday Party Fight Delhi Young Person kills - Sakshi

న్యూఢిల్లీ: జన్మదిన వేడుకలో చిన్నగా మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారి ఓ యువకుడి హత్యకు దారి తీసింది. అతడి స్నేహితుడు తన మిత్రులతో కలిసి దారుణంగా హత్య చేశారు. అయితే అతడి హత్య రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు పార్టీలో ఏం జరిగింది? ఎందుకు హత్య చేశారు? మధ్యలో హిందూ సంఘాలు ఎందుకొచ్చాయో చదవండి.

న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రింకు శర్మ(25) టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. మంగోల్‌పురిలో అతడు నివసిస్తున్నాడు. స్నేహితుడు డానిశ్‌తో కలిసి గురువారం రింకు రాత్రి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లాడు. అయితే పార్టీలో ఇద్దరి మధ్య ఏదో విషయమై వివాదం ఏర్పడింది. ఇద్దరు గొడవ పడ్డారు. కోపంలో డానిశ్‌ పార్టీ అనంతరం ఇంటికి వెళ్తున్న రింకును అడ్డగించారు. డానిశ్‌ తన ముగ్గురు స్నేహితులను పిలిపించి అడ్డగించాడు. ఈ సమయంలో రింకు, డానిశ్‌ ఇద్దరు గొడవపడ్డారు. తీవ్ర ఆవేశంలో డానిశ్‌, అతడి స్నేహితులు రింకు శర్మను కత్తులతో పొడిచారు. 

తీవ్ర గాయాలపాలైన రింకు శర్మ సమీపంలోని ఓ ఆస్పత్రికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే కత్తితో తీవ్రంగా పొడవడంతో కొద్దిసేపటికే మృతి చెందాడు. ఇప్పటివరకు బాగానే ఉన్నా దీనిపై రాజకీయ దుమారం రేగింది. అతడి హత్యపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి. దీనిపై హీరోయిన్‌ కంగనా రనౌత్‌ కూడా స్పందించింది.

రింకు శర్మ కుటుంబసభ్యులు దీనిపై స్పందించారు. బీజేపీ యువ మోర్చ, విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ)లో రింకు క్రియాశీలకంగా ఉన్నాడని తెలిపారు. కొన్నిరోజులుగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం రింకు విరాళాలు వసూలు చేస్తున్నాడని చెప్పారు. అయితే బర్త్ డే పార్టీలో రింకు జై శ్రీరామ్ నినాదాలు చేయగా.. దాన్ని వ్యతిరేకిస్తూ అతడిపై కొంతమంది దాడికి పాల్పడి హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఇవే విషయాలు చెబుతున్నారు. 

అయితే కుటుంబసభ్యులు, వీహెచ్‌పీ చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. హత్య జరిగిన విధానం అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధాన్షు వివరించారు. రింకు, డానిష్ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గతేడాది హోటల్‌ వ్యాపారం ప్రారంభించారు. అయితే నష్టాలు రావడంతో కొన్నాళకు మూసేశారు. ఈ విషయమై రింకు, డానిశ్‌ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై బర్త్ డే పార్టీలో ప్రస్తావన రావడంతో ఇద్దరు గొడవపడ్డారు. ఇదే రింకు హత్యకు కారణమని పోలీసులు స్పష్టం చేశారు. హత్యకు పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అయితే ఈ హత్యపై హీరోయిన్‌ కంగనా రనౌత్‌ స్పందించారు. ‘క్షమించు మేం ఓడిపోయాం’ అని సాథ్వి సాచి చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసింది. రింకుశర్మకు న్యాయం జరగాలి అనే హ్యాష్‌ట్యాగ్‌తో కంగనా ట్వీట్‌ చేసింది. ఆ తండ్రి బాధ చూడండి.. అంటూ రింకుశర్మ మీడియాతో రోదిస్తూ మాట్లాడుతున్న వీడియోను షేర్‌ చేశారు. ఈ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement