
ఇక చౌక దోపిడీ!
● మళ్లీ పాత పద్ధతుల్లో రేషన్ పంపిణీ ● డీలర్ల చేతికి పంపిణీ పగ్గాలు ● దండుకోవడానికి ప్రభుత్వం సహకారం ● దాచుకున్న డబ్బాలు, గోనెసంచులు మళ్లీ తెరపైకి ● అక్రమాలకు అడ్డుగా ఉన్న ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు ● నేటి నుంచి చౌక దుకాణాల నుంచి పంపిణీ
జిల్లా సమాచారం
షాపుల సంఖ్య : 1339
కార్డుదారులసంఖ్య : 5.40 లక్షలు
బియ్యం సరఫరా ప్రతినెలా : 9వేల టన్నులు
చక్కెర : 256 టన్నులు
తొలగించిన డీలర్ల సంఖ్య : 300 మంది
తొలగించిన ఎండీయూ ఆపరేటర్ల సంఖ్య : 336
కాణిపాకం : జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. దీనికి కూటమి ప్రభుత్వం తోడవుతోంది. మళ్లీ పాత పద్ధతులకు శ్రీకారం చుట్టింది. దండుకోవడానికి దగ్గరుండి సహకరిస్తోంది. దీంతో రేషన్ పక్కదారి పట్టనుంది. డీలర్లు పాత డబ్బాలు, గోనె సంచులు బయటకు తీసి పూజలు చేస్తున్నారు. సరుకులు అమ్మకానికి తలుపులు తెరిచిపెట్టారు. అక్రమాలకు అడ్డుగా ఉన్నారనే నెపంతో ఎండీయూ ఆపరేటర్లను తొలగించారు. నేటి నుంచి రేషన్ దోపిడీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
జిల్లాలో 1390 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో 5.40 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీరందరికీ ప్రభుత్వం ప్రతి నెలా ప్రభుత్వం 9 టన్నుల వరకు బియ్యం , 250 టన్నుల వరకు చక్కెర మాత్రమే పంపిణీ చేస్తోంది. ఈ సరుకుల ఆధారంగానే చాలా మంది కార్డుదారులు జీవనం సాగిస్తున్నారు. ప్రతినెలా సరుకుల అందక, డీలర్లతో పోరాటం చేయలేక పస్తులతో గడిపిన క్షణాలను కార్డుదారులు మళ్లీ గుర్తు తెచ్చుకుంటున్నారు. పాత పద్ధతి రేషన్ పంపిణీపై భయపడుతున్నారు.
2019 ముందు రేషన్ పంపిణీ ఇలా..
2019 ముందు రేషన్ పంపిణీ కోసం కార్డుదారులు పడిగాపులు కాసేవారు. అప్పట్లో ప్రజలకు సకాలంలో సరుకులు అందేవి కావు. కాస్త ఆలస్యమైతే రేషన్ లేదని వెనక్కి పంపించేసే వారు. ఇచ్చిన సరుకుల్లో కోతలు కనిపించేవి. గోనె సంచి, డబ్బాలతో తూక మేసి.. రేషన్మేసేసేవాళ్లు. ఇలా భారీగా రేషన్ల్లో కోతలు పడేవి.
2019 తర్వాత రేషన్ సరఫరా ఇలా...
వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు మేలు చేసేలా చేసింది. ప్రధానంగా రేషన్ పంపిణీలో పారదర్శకతను తీసుకొచ్చింది. ఇంటింటికీ రేషన్ విధానాన్ని అమలు చేసింది. వాహనం కేటాయింపుతో పాటు ఎండీయూ ఆపరేటర్లను నియమించింది. ఈ విధానంతో ప్రతి నెలా 1వతేది నుంచి 17 తేదీ వరకు వీధి వీధికి వెళ్లి కార్డుదారులకు రేషన్ పంపిణీ చేసేది. లేవలేని వృద్ధులు, నడవలేని వృద్ధులకు ఇబ్బంది ఉండేది కాదు. ఇక పాత పద్ధతిలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడింది. డీలర్ల ఆటలకు తాళం పడింది.
ప్రసుత్తం కూటమి ప్రభుత్వం వచ్చాక..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ మాఫియాకు ఊపిరొచ్చింది. ప్రతినెలా లక్షల రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు జోరందుకుంది. టన్నుల కొద్ది బియ్యం పోలీసుల కంటపడి వెలుగులోకి రావడంతో కూటమి నేతల అక్రమ వ్యాపారం బట్ట బయలైంది. అక్రమ వ్యాపారులుగా అవతారమెత్తిన కూటమి నేతలు పలు రేషన్ డీలర్లతో చేతులు కలిపి ఈ దందాను నడిపిస్తున్నారు. అక్రమ వ్యాపారానికి అడ్డుగా ఉన్న డీలర్లను తొలగించి వారికి అనుకూలంగా ఉన్న కూటమి నేతలకు డీలర్లుగా నియమించుకున్నారు. ఇలా ఈ ఏడాది కాలంలో 300 మంది డీలర్లను కొత్తగా నియమించారని తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న మహిళ పేరిట కూడా రేషన్ షాపు కేటాయించారంటే...దీని బట్టే రేషన్ బోగస్ను అంచనా వేయవచ్చు. అలాగే అక్రమ వ్యాపారానికి అడ్డుగా ఉన్న 336 మంది ఎండీయూ ఆఫరేటర్లను తొలగించింది. దీంతో ఇంటింటా రేషన్ పంపిణీ వ్యవస్థ రోడ్డున పడింది.
రాగులు, కందిపప్పునకు రాంరాం
కందిపప్పునకు ప్రభుత్వం మంగళం పాడింది. రాగులు పంపిణీ ఆపేసింది. నేటి నుంచి మళ్లీ పాత పద్ధతులు రానున్నాయి. రోజుకు 8 గంటలు రేషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. డీలర్లు వారి వద్ద కార్డుదారులను క్యూ కట్టించనున్నారు. అప్పుడే కొన్ని చోట్ల డబ్బాలు, గోనె సంచులు సిద్ధం చేసి ఉంచారు. అన్ని రకాలుగా కోతలు పెట్టేందుకు సంసిద్ధమయ్యారు. రేషన్ పండగ పేరుతో కార్డుదారుల నుంచి పిండుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. పాత పద్ధతి రేషన్ పంపిణీపై క్షేత్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఏడాది కాలంలో పట్టుకున్న రేషన్ వివరాలు ఇలా..
నెల 6ఏ పట్టుబడ్డ బియ్యం
కేసులు (క్వింటాళ్లల్లో)
జూన్–2024 1 6.16
ఆగష్టు 8 131.9
సెప్టంబర్ 6 93.98
అక్టోబర్ 1 24.1
నవంబర్ 3 18.65
డిసెంబర్ 4 316.56
ఫిబ్రవరి–25 3 110.99
మార్చి 2 104.57
తూకంలో తేడాలొస్తే చర్యలు
రేషన్ పంపిణీ పకడ్బందీగా జరిగేలా చూస్తాం. అందుకే కొంత మందితో కూడిన ఓ టీంను ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నాం. మళ్లీ ఐదు రోజులపాటు జిల్లాలోనే ఉంటాం. రేషన్ పంపిణీలో ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందిస్తాం. కోతలుంటే చర్యలు ఉంటాయి. కార్డుదారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
– రాజేంద్ర ప్రసాద్, ప్రత్యేక అధికారి, చిత్తూరు

ఇక చౌక దోపిడీ!