
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
భద్రాచలం: గిరిజనుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన అర్జీలను స్వీకరించారు. సంబంధిత యూనిట్ అధికారులకు ఎండార్స్ చేసి, పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో ఆదివాసీ గ్రామాల్లో బ్లీచింగ్, శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అర్జీలు, పరిష్కార వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని ఇలా..
ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇప్పించాలని చర్ల మండలం మామిడిగూడెం గ్రామానికి చెందిన సమ్మయ్య ఫిర్యాదు చేశారు. ఎల్టీఆర్ భూ సమస్య పరిష్కరించాలని గుండాల మండలానికి చెందిన వెంకయ్య విన్నవించారు. సౌర విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని సింగరేణి మండలం గేట్ కారేపల్లికి చెందిన శాంత, గురుకులంలో సీటు ఇప్పించాలని ఏన్కూర్కు చెందిన నిహారిక వినతిపత్రాలు అందించారు. ఉద్యోగం కల్పించాలని కూసుమంచికి చెందిన నవ్య, సోలార్ ప్యానల్ ఇప్పించాలని గార్ల మండలం గాజుల తండాకు చెందిన సరోజ, బోరుబావికి అనుమతి ఇవ్వాలని బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రమ విన్నవించారు. నూతన మత్స్య సొసైటీ ఏర్పాటు చేయాలని సూర్యాతండాకు చెందిన 16 మంది అర్జీ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, హరీష్, అరుణ కుమారి, రవీంద్రనాథ్, వేణు, లక్ష్మీనారాయణ, ఉదయకుమార్, ఆదినారాయణ, లింగా నాయక్ పాల్గొన్నారు.
గిరిజన దర్బార్లో ఐటీడీఏ పీఓ రాహుల్