
ప్రజావాణికి తగ్గిన రద్దీ
సూపర్బజార్(కొత్తగూడెం): ఇటీవల తరచూ ఏదో ఒక కారణంతో ప్రజావాణి కార్యక్రమాలు వాయిదా పడుతుండటంతో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు ఎక్కువగా హాజరు కాలేదు. దీనికితోడు చెదురు ముదురుగా వర్షాలు పడుతుండటం, గ్రామీణ ప్రాంతాల్లో వానాకాలం సాగు పనులు ప్రారంభం కావడంతో జనం ఎక్కువ సంఖ్యలో రాలేదు. ప్రజావాణికి హాజరైన అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ వివిధ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలు..
● కుటుంబ పోషణ కోసం ఉద్యోగం ఇప్పించాలని పదో తరగతి చదివిన, పాల్వంచకు చెందిన బధిరురాలు మడిపల్లి నందిని వినతిపత్రం అందజేయగా, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్కు ఎండార్స్ చేశారు.
● తమ గ్రామంలో సంత ఏర్పాటుకు బూర్గంపాడు ఎంపీడీఓ, పోలీసులకు దరఖాస్తు చేసినా స్థల పరిశీలనలో జాప్యం చేస్తున్నారని, త్వరితగతిన పరిశీలన చేపట్టి, సంతకు అనుమతి ఇచ్చేలా చూడాలని బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన దుర్గాల వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయగా, దరఖాస్తును కలెక్టరేట్ ఓఎస్డీకి ఎండార్స్ చేశారు.
● అశ్వాపురం మండలం నెల్లిపాక రెవెన్యూ సర్వే నంబర్ 433/8లోని 30 కుంటల భూమిని 2019లో కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, తన పేరుమీద పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని బీజీ కొత్తూరు గ్రామానికి చెందిన మర్రి కృష్ణారెడ్డి దరఖాస్తు చేయగా, అశ్వాపురం తహసీల్దార్కు ఎండార్స్ చేశారు.