
లైనింగ్ పనుల్లో ఉల్లంఘనలు?
● నివేదికపై
అధికారుల్లో గుబులు
గత టీడీపీ ప్రభుత్వంలో కుప్పం ఉపకాలువ, ఇతర ప్రాజెక్టు పనుల్లో ఇష్టారీతిన పనులు చేసిన కాంట్రాక్టు సంస్థలు అదనపు పని పేరుతో రూ.122 కోట్ల దోచుకున్నారు. కొద్దిపాటి పనులకు కోట్లలో అంచనాలు పెంచుకుని యధేచ్ఛగా దోపిడీపర్వం సాగించారు. ఈ పరిస్థితులను మళ్లీ పునరావృత్తం చేసి షార్ట్ క్రీటింగ్ పని పెరిగిందని, ఒప్పందం కంటే అధిక వ్యయభారం, పనులకు ఆటంకాలు అన్న కారణాలను చూపి ఒప్పంద వ్యయాన్ని పెంచుకునే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సీఈ శేషుబాబు ఇచ్చే నివేదికలో పొందుబరిచే అంశాలపై అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. లైనింగ్ పనుల్లో ఉల్లంఘనలు నిజమేనని తేలిన కారణంగా వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తారని భావిస్తున్నప్పటికి అధికారులను కాపాడేందుకు నివేదికను మార్చడం లేదా తొక్కిపెట్టే ప్రయత్నాలు జరగవచ్చని అంటున్నారు.
మదనపల్లె: హంద్రీ – నీవా ప్రాజెక్టులో భాగమైన జిల్లాలోని పుంగనూరు ఉపకాలువ (పీబీసీ), చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉపకాలువ (కేబీసీ)లో చేపట్టిన లైనింగ్ పనుల నాణ్యత, నిబంధనల ఉల్లంఘనలపై ఈస్ట్కోస్ట్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ శేషుబాబు మూడు రోజుల పర్యటన బుధవారం సాయంత్రం ముగిసింది. రూ.169 కోట్లతో కేబీసీ, రూ.366 కోట్లతో పీబీసీలో లైనింగ్, షార్ట్ క్రీటింగ్ పనులను కాంట్రాక్టు సంస్థలు చేపట్టాయి. కూటమి ప్రభుత్వంలో పనులెలా చేసినా తమను ప్రశ్నించే వారే లేరన్న ధీమాతో ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంపై క్వాలిటీ కంట్రోల్ సీఈ సోమవారం జిల్లాలోని పీబీసీలో జరిగిన పనులపై మొదలు పెట్టిన పరిశీలన..మంగళవారం కేబీసీ రీచ్–1లో, బుధవారం కేబీసీ రీచ్– 2లో జరిగిన లైనింగ్, షార్ట్ క్రీటింగ్ పనులను పరి శీలించి తనిఖీలు చేశారు. దీనిపై ఆయన స్వయంగా చేసుకున్న పరిశీలన సందర్భంగా ప్రాజెక్టు అధికారుల వద్ద, పరిశీలన సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా పరిశీలన పూర్తి చేయడంపై ప్రాజెక్టు అధికారుల్లో గుబులు రేపుతోంది. ఇంతకీ సీఈ ఏం పరిశీలనలో కనిపించిన అంశాలపై స్థానిక అధికారులతో చర్చించలేదని తెలిసింది. ఆయన మాటల్లో కొన్ని అంశాలపై చేసిన సూచనలే పెద్ద ఉల్లంఘనలుగా భావిస్తున్నారు.
మట్టికి షార్ట్ క్రీటింగ్ ఎందుకు?
లైనింగ్ పనుల్లో మట్టికాలువపై చేసే లైనింగ్ పనికి చెల్లించే సొమ్ము కంటే షార్ట్ క్రీటింగ్కు చెల్లించే ధర ఎక్కువ. దీన్ని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టు సంస్థలు మట్టి కాలువపైనా షార్ట్ క్రీటింగ్ చేయడాన్ని గుర్తించి ఈ అంశాన్ని లెవనెత్తి అధికారులను ప్రశ్నించారని అధికార వర్గాలు చెప్పాయి. మట్టికాలువకు షార్ట్ క్రీటింగ్ చేసి అధిక మొత్తంలో ధర పొందడమే కాకుండా ఒప్పందానికి మించి బిల్లు పొందవచ్చని కాంట్రాక్టు సంస్థలు ఈ ఎత్తుగడ వేశారని అంటున్నారు. దీన్ని సీఈ పసిగట్టడంతో ఇకపై ఎలా ముందుకు వెళ్తారన్న దానిపై చూడాల్సి ఉంది. ఈ పరిస్థితి పరిశీలించాక షార్ట్ క్రీటింగ్ పనులు అవసరమైన మేరకే చేయించడం, ఆపై అనవసరంగా వద్దు అని సూచన చేశారని తెలిసింది. రెండు కాలువల్లోనూ పరిశీలించిన అంశాలల్లో కాంట్రాక్టు సంస్థల ఉల్లంఘనలు ఉన్నట్టు తేలిందని సమాచారం.
మట్టి కాలువపైనా షార్ట్ క్రీటింగ్పై ఆరా
షార్ట్ క్రీటింగ్ అవసరమైన మేరకే చేయాలని సూచన
పీబీసీ, కేబీసీలో పనులపై ముగిసినక్వాలిటీ కంట్రోల్ సీఈ విచారణ
ఇచ్చే నివేదికలో ఏముంటుందోనని అధికారుల్లో టెన్షన్