తక్కువ ధరకు వస్తుంటే ఎక్కువకు కొంటారా?  | Enadu strange story on electricity purchases | Sakshi
Sakshi News home page

తక్కువ ధరకు వస్తుంటే ఎక్కువకు కొంటారా? 

Nov 11 2023 4:42 AM | Updated on Nov 11 2023 3:42 PM

Enadu strange story on electricity purchases - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోళ్లపై కనీస అవగాహన లేకుండా ‘డిస్కంల మిగులు ఆట’ అంటూ ఈనాడు ఓ తప్పుడు కథనాన్ని ప్రజలపై రుద్దింది. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్‌ దొరుకుతుంటే.. ఖరీదు ఎక్కువ ఉన్న స్వల్పకాలిక కొనుగోలు ఒప్పందాల నుంచి తగ్గిస్తున్నారంటూ ఓ వింత కథ అల్లింది.

డిస్కంలకు.. తద్వారా ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూరే నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ విషయంలో వాస్తవాలను ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు వెల్లడించారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యుత్‌ డిమాండ్‌ తగ్గింది. దానివల్ల స్వల్పకాలిక కొనుగోలు ఒప్పందాల నుంచి ఈ నెలలో రావాల్సిన విద్యుత్‌ను నిబంధనలకు అనుగుణంగా డిస్కంలు తగ్గించుకున్నాయి.

డిమాండ్‌కు అనుగుణంగా వారం ముందు ప్రణాళికలో భాగంగా విద్యుత్‌ సేకరణ తగ్గించాయి. రోజువారీ, రియల్‌ టైం గ్రిడ్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి తగ్గితే రియల్‌ టైం మార్కెట్‌ నుంచి కొని లోడ్‌ షెడ్డింగ్‌ రాకుండా, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నాయి.

ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తిని ప్రతి నిమిషానికీ సర్దుబాటు చేస్తూ రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ సూచనల ప్రకారం అవసరమైన సమయంలో మార్కెట్‌ నుండి విద్యుత్‌ సేకరిస్తున్నాయి.

దేశం మొత్తం డిమాండ్‌ తగ్గడంతో ప్రస్తుతం మార్కెట్‌లో విద్యుత్‌ ధరలు తగ్గాయి. యూనిట్‌ రూ.3 నుంచి రూ.4.50కే లభిస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని డిస్కంలు స్వల్పకాలిక ఒప్పందాల కొనుగోలు తగ్గించి, మార్కెట్‌ నుంచి అవసరానికి తగ్గట్టు కొంటున్నాయి. దీనివల్ల డిస్కంలకు ఆర్థిక లాభం చేకూరుతుంది. అంతేగానీ చేతిలో ఉన్న విద్యుత్‌ను వదిలేసి మార్కెట్‌ నుంచి కొనేందుకు డిస్కంలు పరుగులు పెట్టడం లేదు.

చంద్రబాబు హయాంలోనే అనవసర ఒప్పందాలు 
రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉన్నప్పటికీ బ్యాక్‌ డౌన్‌ చేసి అనవసర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే. రాష్ట్రంలో 2015–16 మధ్య 642 మిలియన్‌ యూనిట్లు, 2016–17లో 12 వేల మిలియన్‌ యూనిట్లు, 2018–19లో 7,600 మిలియన్‌ యూనిట్ల మిగులు విద్యుత్‌ ఉండేది.

రూ.2.40కు లభిస్తున్న బొగ్గు ఆధారిత ఈ మిగులు విద్యుత్‌ను బ్యాక్‌ డౌన్‌ (వృథా) చేసి ప్రైవేటు విద్యుత్‌ కొనుగోలును చంద్రబాబు ప్రోత్సహించారు. పవన విద్యుత్‌ను యూ­నిట్‌కు ఏకంగా రూ.4.84కు తీసుకున్నారు. ఫిక్స్‌డ్‌ చార్జీతో కలిపి ఈ ధర రూ.5.94 అయ్యేది. సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.3.54 కు బదులు రూ.8.90 వెచ్చించారు. ఇలా దాదాపు 7 వేల మెగావాట్ల విద్యుత్‌ కొను­గోలు ఒప్పందాల వల్ల ఏటా రూ.3,500 కోట్లు భారం ఇప్పటికీ పడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement