
విజయవాడలో ధర్నా చేస్తున్న సీపీఎస్ ఉద్యోగులు
సీఎం చంద్రబాబును నిలదీసిన ఉద్యోగులు
ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్
లేకపోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు
సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతల హెచ్చరిక
ఉద్యోగుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించిన ఏపీఎన్జీవో సంఘం
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన ధర్నాచౌక్
వేలాదిగా తరలివచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీపీఎస్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చినమాట నిలబెట్టుకోకపోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ఓపీఎస్ పునరుద్ధరణ తమ భవిష్యత్తుకు, తమ కుటుంబ భద్రతకు తప్పనిసరని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర ఆరి్థకనష్టం కలిగించే సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం సీపీఎస్ ఉద్యోగులు ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది ఉద్యోగులు విజయవాడలోని ధర్నాచౌక్కు తరలివచ్చారు. ఓపీఎస్ పునరుద్ధరించాలని, చంద్రబాబు హామీని నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన భారీ సభలో అతిథిగా పాల్గొన్న ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు పూర్తి సంఘీభావం తెలిపారు.
సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేంతవరకు సీపీఎస్ ఉద్యోగుల ప్రతి ఆందోళనకు మద్దతు ఇస్తామని చెప్పారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి అంకితభావంతో సేవలందిస్తున్న ఉద్యోగులను మార్కెట్కి వదిలేయడం అన్యాయమని చెప్పారు. ఉద్యోగి ఎంత కష్టపడినా, చివరికి మార్కెట్ పరిస్థితుల మీదే అతడి వృద్ధాప్యం ఆధారపడుతోందని చెప్పారు.
సీఎం, డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు
సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే సీపీఎస్ ఉద్యోగులతో చర్చించి వారికి ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానాన్ని ప్రకటిస్తామని కూటమి హమీ ఇచ్చిందని, ఈ అంశాన్ని వారి ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా పెట్టారని తెలిపారు. కానీ 18 నెలలు పూర్తయినా ప్రభుత్వం చర్చల ప్రతిపాదనే చేయలేదన్నారు. ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కలిసేందుకు అనేకసార్లు ప్రయతి్నంచినా తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు.
సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్.మరియదాసు మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయలు చెల్లించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సీపీఎస్ ఉద్యోగులకు అమలు చేస్తున్న అనేక మెమోలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉద్యోగులను మోసం చేస్తోందని చెప్పారు. పాత పెన్షన్ విధానం జీవితకాల భద్రతను కల్పించేదని, కొత్త విధానం మార్కెట్ ఆధారంగా ఉండటం వల్ల స్థిరత్వం లేదని పేర్కొన్నారు.
జీతంలో భాగాన్ని ఉద్యోగులు స్వయంగా కాంట్రిబ్యూట్ చేయాల్సి రావడం, రిటైర్మెంట్ తర్వాత కచ్చితమైన పెన్షన్ హామీ లేకపోవడం వల్ల కుటుంబ భవిష్యత్ అస్థిరంగా మారుతోందని చెప్పారు. సంవత్సరాల తరబడి సేవచేసిన ఉద్యోగులు వృద్ధాప్యంలో కనీస భద్రత కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ, ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు పాండురంగశర్మ, హృదయరాజు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, సీపీఎస్ఈఏ నాయకులు రాజే‹Ù, రవికుమార్, అప్పలనాయుడు పాల్గొన్నారు.
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
ఛలో విజయవాడలో భాగంగా ధర్నాచౌక్లో ధర్నా చేసిన తర్వాత అక్కడి నుంచి బందరు రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని సీపీఎస్ ఉద్యోగులు కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. కానీ పోలీసులు.. ర్యాలీకి అనుమతి లేదంటూ ధర్నాచౌక్ నుంచి వారిని కదలనీయలేదు. దీంతో వేలాదిగా వచ్చిన ఉద్యోగులు అక్కడే నినాదాలతో హోరెత్తించారు.
చెవిలో పూలతో టీటీడీ ఉద్యోగుల ధర్నా
సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్
తిరుపతి అన్నమయ్యసర్కిల్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీటీడీ పరిపాలన భవనం వద్ద టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్, సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఉద్యోగులు చెవిలో పూలు పెట్టుకుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 2004 తరువాత చేరిన ఉద్యోగులకు సీపీఎస్ విధానం వర్తిస్తుందంటూ పాలకులు ఉద్యోగుల మధ్య విభజన తీసుకొచ్చారని విమర్శించారు. ఆ చట్టంలోనే ప్రస్తుతం పాత పెన్షన్ స్కీమును ఎప్పుడైనా సమీక్ష చేస్తామంటూ హామీ ఇచ్చారని, అయితే ఈ విధానం ఆయా రాష్ట్రాల పరిధికి వదిలేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమని ఆవేదన చెందారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీపీఎస్ను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు నోరుమెదపడం లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు గోల్కొండ వెంకటేశం, కాటా గుణశేఖర్, నైనార్ పద్మనాభం, ధారా రవికుమార్, ఆవుల నరే‹Ù, కిరణ్ కుమార్, పి దయాకర్, ఆర్ వేణుగోపాల్, కోనేటి బాలాజీ, ఆదిలక్ష్మి, శ్రీలక్ష్మి, ఇందిరా, ప్రతిభా భారతి, శకుంతల, గౌరి, డి యుగేందర్, ఎస్ వెంకటముని రాజు,పయ్యావుల రాజశేఖర్, బి.హనుమంత రెడ్డి, చలపతి పాల్గొన్నారు.