అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 725 వినతులు అందాయి. డీఆర్ఓ ఎ.మలోలతో పాటు డిప్యూటీ కలెక్టర్లు రామకృష్ణారెడ్డి, ఆనంద్, వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు, వైద్యశాఖ ఏఓ మల్లికార్జునరెడ్డి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో డీఆర్ఓ సమీక్షించారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
వినతుల్లో కొన్ని...
● దివ్యాంగ పింఛను ఇప్పించాలని ఆత్మకూరు మండలం వడ్డుపల్లికి చెందిన దివ్యాంగుడు బాలయోగి విన్నవించాడు. ప్రమాదం జరిగిన అనంతరం జరిగిన శస్త్రచికిత్సలో ఎడమ చేతిని మోచేతి వరకు తొలిగించారని చెప్పాడు. దీంతో పనులు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉందని వాపోయాడు.
● కుటుంబ పోషణ భారంగా మారిందని, తనకు పింఛను ఇప్పించి ఆదుకోవాలని విన్నవించాడు.
● వితంతు పింఛను మంజూరు చేయించాలని అనంతపురంలోని రాణీనగర్కు చెందిన నాగలక్ష్మి విన్నవించింది. తన భర్త శరబయ్యకు వృద్ధాప్య పింఛను వచ్చేదని గుర్తు చేశారు. ఆయన 2023, జూన్ 27న మరణించాడని వివరించింది. జీవనానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నానని, వితంతు పింఛను మంజూరు చేయించాలని వేడుకుంది.
వివిధ సమస్యలపై 725 వినతులు
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
అధికారులకు డీఆర్ఓ మలోల ఆదేశం