సాక్షి, పాడేరు: కలెక్టరేట్లో శుక్రవారం రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎం.బి.అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూశాఖలో ఉత్తమ సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఎస్డీసీ టి.అప్పారావు, డీటీ రామ్మూర్తి, ఆర్ఐలు ఈశ్వరరావు, శ్రీహరి, పలువురు,ఉద్యోగులకు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రిటైర్డ్ ఎస్డీసీ టి.అప్పారావు మాట్లాడుతూ రెవెన్యూ శాఖ సేవలు నిరుపమానమన్నారు. తుపాన్లు, విపత్తులు, వరదలు, ఎన్నికల సమయంలో గిరిజన ప్రాంతాల్లో విధి నిర్వహణ ఎంతో కష్టం ఉంటుందన్నారు. నిరక్షరాస్యత శాతం అధికంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో రెవెన్యూశాఖ తరపున విధులు నిర్వహించడం విశేషమన్నారు. రెవెన్యూ సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రతి ఏడాది రాష్ట్ర, జిల్లా స్థాయిలో రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశాలిచ్చిందన్నారు. కలెక్టరేట్ కో–ఆర్డినేషన్ విభాగ సూపరింటెండెంట్ తిరుమలరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగరాజు, సబ్కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి పోలరాజు, ఆర్ఐలు, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు.