
బస్సుల్లేక కష్టాలు
● పాడేరు డిపో నుంచి రెండో రోజు పూర్తిస్థాయిలో నడవని ఆర్టీసీ సర్వీసులు
● 46 బస్సుల్లో 17 కేటాయింపు
● ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్లిన గిరిజనులు
విశాఖపట్నంలోని యోగాంధ్ర కార్యక్రమానికి విద్యార్థులను తరలించేందుకు పాడేరు ఆర్టీసీ డిపో బస్సులను వినియోగించడం వల్ల శుక్రవారం కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ డిపో పరిధిలో 46 బస్సులు ఉండగా వీటిలో 17 బస్సులను కేటాయించడంతో మారుమూల గ్రామాలకు సర్వీసులు లేకుండా పోయాయి. పాడేరు నుంచి జీకేవీధి, జోలాపుట్టు, అరకులోయ వెళ్లే మార్గాల్లో సర్వీసులు తగ్గించేశారు. దీంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు శుక్రవారం ఉదయం నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ జీపులు, ఆటోలను ఆశ్రయించారు. చింతపల్లి మార్గంలో ప్రయాణించే వారు పడిగాపులు కాశారు. మంప, డొంకరాయి వెళ్లే సర్వీసులను డిపో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. ఎట్టకేలకు సాయంత్రం ఐదు గంటలకు చింతపల్లి మార్గంలో బస్సు సర్వీసును నడపడంతో రద్దీ నెలకొంది. పలు ప్రాంతాలకు వెళ్లే నైట్ హాల్ట్ సర్వీసులు కూడా రద్దయ్యాయి. పాడేరు నుంచి విశాఖ ఆరు సర్వీసులు మాత్రమే నడిపారు. అరకు మీదుగా ఎస్.కోట, విశాఖ బస్సు సర్వీసులను తగ్గించేశారు.
– సాక్షి, పాడేరు

బస్సుల్లేక కష్టాలు