breaking news
urdu school
-
డీఈఓ సారూ.. గిదేం తీరు?
- పది తరగతులకు.. ఒక్కరే ఉపాధ్యాయిని! - వలంటీర్లను కూడా నియమించని వైనం - ఆందోళనలో తడ్కల్ విద్యార్థులు తడ్కల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నా క్షే త్రస్థాయి పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ని నియమించాల్సి ఉండగా ఎక్కడా ఇది అమలుకు నోచుకోవడం లేదు. కంగ్టి మండలం తడ్కల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు కొనసాగుతున్న ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ఒకే ఒక్క ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఈమె సెలవు పెడితే స్కూల్ తెరుచుకోని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని నమ్మి తమ పిల్లలను చేర్పిస్తే ఇక్కడ పాఠాలు బోధించే వారే కరువయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాఅభియాన్ ఆధ్వర్యంలో 2011 జనవరి 12న తడ్కల్ పాఠశాలను తొమ్మిదో తరగతి వరకు అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం 122 మంది విద్యార్థులతో పదో తరగతి వరకు ఇక్కడ అందుబాటులో ఉందని స్కూల్ హెచ్ఎం రజియాసుల్తానా తెలిపారు. తరగతులు పెంచేందుకు అనుమతి ఇస్తున్న విద్యాశాఖ అధికారులు దీనికి తగ్గట్టుగా సిబ్బందిని నియమించడంలో దారుణంగా విఫలం అవుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పదో తరగతి వరకు నడుస్తున్న తడ్కల్ ఉర్దూ పాఠశాలకు కేవలం మూడు ఎస్జీటీ పోస్టులు మాత్రమే మంజూరయ్యాయి. ప్రస్తుతం ఒక్కరంటే ఒక్కరే పాఠశాలను నిర్వహిస్తున్నారు. గతంలో విద్యా వలంటీర్ల ద్వారా చదువులు అందించినా ఈ సారి అది కూడా లేదు. దీంతో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. తమ పిల్లలను ఉర్దూ మీడియం కాకుండా తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో చదివించినా ఈ దుస్థితి ఉండేది కాదని పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా డీఈఓ స్పందించి పాఠశాలలో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. కనీసం వలంటీర్లనైనా నియమించాలని వేడుకుంటున్నారు. -
ఎలిమెంటరీ దాటితే ఇంటికే!
గాజులపల్లె(మహానంది),న్యూస్లైన్ : జిల్లాలో ఉర్దూ విద్యా బోధనను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి పర్వాలేదనిపించినా హైస్కూళ్ల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఉపాధ్యాయులు లేకపోగా విద్యా శిక్షకులను కూడా నియమించకుండా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా అప్పటి దాకా ఉర్దూ మీడియంలో చదువు సాగించిన విద్యార్థులు ఇతర మీడియంలోకి వెళ్లలేక, ఇదే మీడియంలో హైస్కూల్లో చదివేందుకు ఉపాధ్యాయులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె ఉన్నత పాఠశాల పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఈ స్కూల్లో మూడేళ్లుగా ఉపాధ్యాయులు లేకపోయినా జిల్లా అధికారులు ఏ మాత్రం స్పందించడంలేదు. ఫలితంగా విద్యార్థులు ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు చదివేందుకు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారుతోంది. కొందరు ఇతర మీడియంలోకి వెళ్తున్న అక్కడ ఇమడలేకపోతున్నారు. అప్పటిదాకా నేర్చుకున్న ఉర్దూను పూర్తిగా మరిచిపోతున్నారు. జిల్లా అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో మొరపెట్టుకున్నా పట్టించకునే నాథుడు లేకపోవడంతో విద్యార్థులు నిత్యం పాఠశాలకు వెళ్లి సాయంత్రం వరకు కూర్చొని తిరిగి ఇంటికి వస్తున్నారు. స్వాతంత్య్రం రాకముందే ఏర్పాటు 20-07-1944లో ఏర్పాటైన గాజులపల్లె ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో వేలాదిగా విద్యార్థులు ఉర్దూను అభ్యసించారు. ప్రస్తుతం 1నుంచి ఐదో తరగతి వరకు 83 మంది విద్యార్థులు, వారికి ముగ్గురు ఉపాధ్యాయులున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే విద్యార్థులను ఇబ్బందులు పీడిస్తున్నాయి. ఐదు దాటితే కష్టాలే.. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళ్లే సరికి టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. 2010-11, 2011-12లో ఒక వాలంటీర్ను, 2012-13లో డిప్యూటేషన్పై ఇద్దరు ఉపాధ్యాయులతో నెట్టుకొచ్చినప్పటికీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఉ పాధ్యాయులను నియమించకపోవ డం గమనార్హం. జిల్లాలో 14 ఉర్దూ హైస్కూళ్లుండగా నాలుగు మినహా మిగతా వాటి పరిస్థితి ఇదేనని తెలుస్తోంది. చదువు మానేస్తున్న విద్యార్థులు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉర్దూ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 120 మందికి పైగా ఉన్న విద్యార్థులు ప్రస్తుతం 76కు తగ్గిపోయారు. టీచర్లు లేకపోవడంతో కొందరు చదువు మానేస్తుండగా మరికొందరు ఇతర మీడియంలోకి వెళ్తున్నారు. విషయంపై ఎంఈఓ జయమ్మ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలున్న దృష్ట్యా పదో తరగతి విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో బోధన చేయిస్తామని తెలిపారు.