breaking news
upanayanam
-
వేదకాలం నుంచి నేటి కాలం వరకు.. విదుషీమణులు
ప్రాచీన కాలంలో, అంటే క్రీ.పూ.3000 సంవత్సరాల ముందు కాలం నుండీ కూడా మన దేశం ‘స్త్రీ విద్య’ ను ప్రోత్సహించి, గౌరవించింది. ఆనాటి నుండీ స్త్రీలు లౌకిక, అలౌకిక విద్యలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. వేదకాలంలోనే మహిళలు ఉపనయన సంస్కారాలు పొంది, వేదాధ్యయనం చేశారు. వేద మంత్రాలు దర్శించారు. తపస్వినులు, ఆధ్యాత్మికవేత్తలైన స్త్రీలను ‘ఋషికలు’ అంటారు. రోమశ, గార్గి వాచక్నవి, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి, మైత్రేయి, అపాల, యామి, పౌలోమి, ఘోష, ఖోన, జుహు, వాగంభ్రణి, సావిత్రి, దేవజామి, కక్షివతి, దక్షిణ ప్రజాపత్య, విశ్వావతి, పశుక్రపత్ని, దేవసూని, శాశ్వతి, అంగీరసి, శ్రీ లక్ష్మి, నోధ, శిఖతన్వరి, గౌపాయన, ఉభయభారతి, విజ్జిక, కామాక్షి వంటి స్త్రీలందరూ ఋషికలే. గృహజీవనానికి స్త్రీయే పునాది అని ఋగ్వేదం చెప్పింది. శక్తిస్వరూపిణి అయిన స్త్రీని గౌరవించి, ఆరాధించే సంస్కృతి మనది. పరబ్రహ్మలోని స్త్రీ పరమైన గుణాలు, శక్తులు కలిసి ‘స్త్రీ దేవతలు’ అవతరించారు. వారి గురించి తెలుసుకుందాం. లోపాముద్ర: అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర సంస్కృత, తమిళ భాషలలో నిష్ణాతురాలు. లోపాముద్ర అంటే తనలో తానే లీనమైన ఆత్మనిష్ఠాపరురాలు అని అర్థం. అగస్త్యునికి, లోపాముద్రకు మధ్య జరిగిన సంవాదం, లోపాముద్ర పాండిత్యం, గెలుపును ఋగ్వేదం ప్రశంసించింది. అగస్త్యుడు, లోపాముద్ర సాహచర్యంలో సంవాదాలలో భౌతిక, ఆధ్యాత్మిక జీవితంలోని పవిత్రతను, పూర్ణత్వాన్ని గ్రహించాడని చెబుతారు.ఘోష: ఆమె దుర్గతమసుని మనుమరాలు. కక్షివంతుని కూతురు. దేవ వైద్యులైన అశ్వనీ కు మారులను స్తుతిస్తూ ఆ తండ్రీ కుమా రులు అనేక శ్లోకాలు రచించారు. పదవ ప్రకరణంలోని కొన్ని శ్లోకాలను తండ్రి, తాతగార్లతో సమానంగా ఘోష రచించింది. వాటిలోని ఒక శ్లోకంలో ఆమె అశ్వినులను వివాహం చేసుకోవాలనే ఆకాంక్షను వెల్లడిస్తుంది. కుష్ఠువ్యాధిచే కురూపి అయిన ఆమెను అశ్వనీ దే వతలు తమ వైద్యంతో ఆరోగ్యవంతు రాలిని, అందగత్తెను చేసి పెండ్లి చేసు కొంటారు.ఋగ్వేద మంత్ర ద్రష్ట మైత్రేయి: గొప్ప తాత్వికురాలు, ఋషిక అయిన మైత్రేయి కూడా ఋగ్వేద మంత్రాలను దర్శించింది. ఆమె తన భర్త అయిన యాజ్ఞవల్క్యుని వ్యక్తిత్వ, ఆధ్యాత్మిక ఆలోచనలను పరిణితి చెంచేలా చేయడంలో ప్రధానపాత్ర వహించింది. యాజ్ఞవల్క్యునికి కాత్యాయని అనే రెండవ భార్య కూడా ఉంది. ధర్మశాస్త్రాలు, వేదాలు బాగా చదివి, బ్రహ్మవాదినిగా మైత్రేయి ఘనత వహిస్తే, కాత్యాయని ఒక సాధారణ ఇల్లాలిగానే ఉండింది. ప్రాపంచిక చింతనలు విడిచి, సన్యాసికి అనువైన స్వీయ నియంత్రణ, సన్యాసి ప్రతిజ్ఞా పాలన చేయదలచి యాజ్ఞవల్క్యుడు ఒకరోజు తన ప్రాపంచిక ఆస్తిపాస్తులను తన ఇద్దరు భార్యలకు పంచదలిచాడు. ప్రపంచ సంపద తనకు శాశ్వతత్వాన్ని, ముక్తిని ఇవ్వలేదని భావించి మైత్రేయి తన భర్త నుండి కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ముముక్షత్వానికి కావలసిన శిక్షణను కోరుకొని మరీ పొందింది.బ్రహ్మజ్ఞాని గార్గి: వాచక్న మహర్షి కూతురు, వైదిక ప్రవక్త గార్గి. మానవ అస్తిత్వానికి, ఉనికికి, జీవితానికి మూలమేమిటి అనే అంశంపై గార్గి అనేక వేదమంత్రాలను దర్శించింది. ఎందరో వేదాంత వేత్తలను వాదంలో గెలిచిన యాజ్ఞవల్క్యునికి ఆత్మానాత్మల విచారం గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి అనేక ప్రశ్నలను సంధించి గార్గి ఆయనను ముప్పుతిప్పలు పెట్టింది. గొప్ప విజ్ఞాని ఉభయభారతి: మధ్యయుగంలో తత్వవేత్త, మీమాంస, అద్వైత దర్శనాలలో ప్రవీణుడైన మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి ఒక గొప్ప విజ్ఞాని. శ్రీ ఆదిశంకరాచార్యులకు, మండనమిశ్రునికి మధ్య జరిగిన అద్వైత సిద్ధాంత సంబంధిత వాదోపవాదాలకు ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. పక్షపాత రహితంగా ఆ వాదనలలో తన భర్తను కాక, ఆదిశంకరులనే విజేతగా ప్రకటించిన విదుషీమణి ఆమె.ఆళ్వార్ ఆండాళ్: ఇంకా ఆ యుగంలో ‘తిరుప్పావై’ అనే భక్తి గీతాలను వ్రాసిన మొదటి మహిళా ఆళ్వార్ అండాళ్. స్త్రీ స్వేచ్ఛ, వ్యక్తిత్వంపై కవితలు వ్రాసిన కర్నాటకలోని శివ భక్తురాలు అక్క మహాదేవి. రాజస్థాన్ లోని కృష్ణ భక్తురాలు, సాంఘిక దురాచారాలను ప్రతిఘటించిన కవయిత్రి మీరాబాయి, సరళ భాషలో వేదాంతపరమైన నిగూఢార్థాలు చాటిచెప్పిన తత్వవేత్త లాలాదేవి, గ్రామీణుల సాధారణ జ్ఞానాన్ని వేదాంత విజ్ఞానంతో అనుసంధిస్తూ రచనలు చేసిన తమిళ కవయిత్రి అవ్వయ్యార్, ఇంకా సక్కుబాయి, ముక్తాబాయి, మదాలస, ఈ మధ్యకాలంలో తరిగొండ వెంగమాంబ, ఆదోని లక్షమ్మ, జిల్లెళ్ళమూడి అనసూయమ్మ మొదలైన యోగినులు, అంతర్బుద్ధి సిద్ధులైన మహిళలు ఎందరో ఉన్నారు.విజ్జిక: దండి మహాకవి తన ఒక రచనలో సరస్వతీ దేవిని తెలుపు దేహరంగు చ్ఛాయ కలదిగా వర్ణించాడు. విజయాంబిక (విజ్జిక) అనే కవయిత్రి నలుపురంగుతో ఉండేది. ఆమె దండి అభిప్రాయాన్ని ప్రతిఘటించింది. నల్లని దేహకాంతిగల అపర సరస్వతినైన నా గురించి తెలుసుకోకుండా సరస్వతి ధవళవర్ణిని అని దండికవి ఎలా అంటాడని ఆమె ప్రశ్నించింది. స్త్రీల ఆత్మవిశ్వాసానికి విజ్జిక ఒక ప్రతీక. ఇంకా గంగాదేవి, తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల వంటి కవయిత్రులు రసవత్తర కావ్యాలు వెలువరించి పురుషులతో సమానంగా నిలిచినవారే.ఆధ్యాత్మిక వేత్త గౌతమి: బౌద్ధయుగంలో గౌతమ బుద్ధుని పెంపుడు తల్లి అయిన మహా ప్రజావతి గౌతమి ఒక ఆధ్యాత్మికవేత్త. ఆమె కాక బౌద్ధ వేదాంత ధ్యాన సన్యాసినులు ఖేమ, ఉప్పలావన, రెండవ భాస్కరుని కూతురైన లీలావతి వంటి ఆధ్యాత్మిక వేత్తలైన స్త్రీలుండేవారు. – డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)
-
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
టాలీవుడ్ నటి అనసూయ ఇంట మరో వేడుక జరిగింది. ఇటీవలే నూతన గృహ ప్రవేశం చేసిన అనసూయ.. తాజాగా తన పెద్ద కుమారుడికి ఉపనయనం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తన కుమారుడు శౌర్య భరద్వాజ్కు సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకను జరుపుకున్నారు. ఉపనయనం అంటే మన ఆధ్యాత్మిక పద్ధతులను పాటించండం, వైదిక సంప్రదాయంలో ప్రకారం ఉపనయన వేడుకలో శరీరంపై యజ్ఞోపవీతం (పవిత్ర దారం) ధరిస్తారు. ఈ వేడుకకు సంబంధించిన వేడుకను అనసూయ తన ఇన్స్టాలో పంచుకుంది.అనసూయ తన ఇన్స్టాలో రాస్తూ..'నా పెద్ద కొడుకు ప్రియమైన శౌర్యభరద్వాజ్.. నీకు ఈ అధికారిక వేడుక అవసరం లేదని నేను ఎప్పుడూ అనుకోలేదు.. కానీ ఈరోజు నీ ఉపనయనం వేడుకతో నీ తల్లిదండ్రులుగా, కుటుంబంగా మేమంతా కలిసి ఆధ్యాత్మిక పునర్జన్మలోకి అడుగుపెట్టాం. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలు, సూత్రాలు, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా.. మన సాంస్కృతిని కొనసాగించేలా వాగ్దానాన్ని తీసుకున్నాం. నువ్వు మన సంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి మాకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. ఆ హనుమాన్ జీ శక్తి నిన్ను ఎల్లప్పుడూ నీతి మార్గంలో నడిపిస్తుంది' అంటూ పోస్ట్ చేసింది. ఇవాళ హనుమాన్ జయంతి కావడంతో అనసూయ ఈ శుభకార్యం చేపట్టినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవలే టాలీవుడ్ స్టార్ నటి అనసూయ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది. తన జీవితంలో మరో కొత్త అధ్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది. అంతేకాకుండా తన కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టింది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తన కొత్త ఇంటిలో జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వివరిస్తూ అనసూయ పోస్ట్ చేసింది. ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలైన హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం గురించి వివరిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. మా ఇంటికి సంజీవని అని పేరు పెట్టాలనుకున్నామని.. కానీ గురువు(పూజారి) సూచనలతో శ్రీరామసంజీవని అని పెట్టుకున్నామని తెలిపింది. ఆ రోజే మా ఇంటికి ఆంజనేయుడు వచ్చాడని గురువు తన ఫోన్లో ఫోటోను చూపించారని భావోద్వేగానికి గురైంది.ఉపనయనం అంటే ఏమిటి?ఉపనయనం అనేది ఒక ప్రాచీన హిందూ ఆచారం. ఇది వేదాధ్యయనానికి, ఆధ్యాత్మిక జీవితానికి, సమాజంలో గౌరవప్రతిష్టను అందుకోవడానికి ప్రారంభంగా భావిస్తారు. ఉపనయనం విద్యాభ్యాసం, గురువు-శిష్య సంబంధంలో ముఖ్యమైన దశగా చెబుతారు. ఈ ఆచారం ముఖ్యంగా హిందూ కుటుంబాల్లో కనిపిస్తుంది. ఈ ఆచారం సాధారణంగా అబ్బాయిలకు విద్య నేర్చుకునే తొలి దశగా పరిగణిస్తారు.ఈ ఆచారం అబ్బాయిలకు సంబంధించినది అయినప్పటికీ.. ఆధునిక కాలంలో అమ్మాయిలకు కూడా ఈ ఆచారం నిర్వహిస్తున్నారు. అయితే, ఇది సంప్రదాయబద్ధంగా చూస్తే కేవలం అబ్బాయిలకు మాత్రమే నిర్వహిస్తారు. పురాణాలలో, హిందూ ధర్మంలో ఈ ఆచారం అబ్బాయిలకే జరిపినట్లుగానే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఉపనయనం వేడుకను సాధారణంగా పిల్లల వయస్సు 7 నుండి 16 సంవత్సరాల మధ్య చేయడం ఉత్తమమని భావిస్తారు. దీనికి కారణం, ఈ వయస్సులో పిల్లలు మానసికంగా, శారీరకంగా బలంగా మారేదశగా గుర్తిస్తారు. ఈ ఆచారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖాండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా పాటిస్తారు. -
ఉపనయనంతోనే ద్విజత్వం
షోడశోపచారాలలో ఉపనయనం ఒకటి. ఇది ప్రధానమైనది. ఉపనయనమనగా బ్రహ్మచారిని గ్రహించడమని అథర్వవేదం వలన తెలుస్తుంది. అంటే ఆచార్యుడు ఒక బ్రహ్మచారికి వేదవిద్య నేర్పించేందుకుగాను శిష్యునిగా స్వీకరించడమని అర్థం. ఈ సంస్కారానికే మౌంజీబంధనం, వటుకరణం, ఉపాయనం అని వేరే పేర్లుకూడా వున్నాయి. గాయత్రీ ఛందస్సుతో బ్రాహ్మణులని, త్రిష్టుభ్ ఛందస్సుతో క్షత్రియుల్నీ, జగతీ ఛందస్సుతో వైశ్యుల్నీ ఆ సృష్టికర్త సృష్టించాడని ఆపస్తంభుడు తన ధర్మ సూత్రాలలో తెలియజేశాడు. ఈ సంస్కారం వల్ల ద్విజత్వం సిద్ధిస్తుంది. అంటే రెండో జన్మ ప్రాప్తించినట్లే అని శాస్త్రం. అందుకే ఉపనయనం అయినవారిని ద్విజులు అంటారు. ఉపనయనాన్ని బ్రాహ్మణులకి గర్భాష్టమాన, అంటే ఏడో సంవత్సరంలో చేయాలని చెప్పారు. కొందరు శాస్త్రకారులు ఎనిమిదో సంవత్సరంలో చేయాలన్నారు. క్షత్రియులకి పదకొండో సంవత్సరంలో, వైశ్యులకి పన్నెండో సంవత్సరంలో చేయాలని సూచించారు. ఈ సంవత్సరాల ప్రామాణికత, వారికి ఉపదేశించే ఛందస్సుల ఆధారంగా నిర్ణయించబడింది. అంటే, గాయత్రీ ఛందస్సులో ఒక పాదానికి ఎనిమిది అక్షరాలు, త్రిష్టుభ్ ఛందస్సులో ఒక పాదానికి పదకొండు అక్షరాలు, జగతి ఛందస్సులో ఒక పాదానికి పన్నెండు అక్షరాలు వుంటాయి. ఉపనయనం చెయ్యడానికి రకరకాల శాస్త్రకారులు రకరకాల వయస్సులను ప్రామాణికంగా చెప్పివుండడం విశేషం. ఎవరు ఎలా చెప్పినా, ఉపనయనానికి కనీసం ఏడు సంవత్సరాలు వుండాలన్నది అందరి అభిప్రాయం. అలాగే, బ్రాహ్మణులకి పదహారు సంవత్సరాలు, క్షత్రియులకి ఇరవై రెండు సంవత్సరాలు, వైశ్యులకి ఇరవైనాలుగు సంవత్సరాలు దాటకూడదన్నది శాస్త్రం. తరువాతి కాలంలో శాస్త్రకారులు ఈ హద్దును వరసగా ఇరవై రెండు, ముప్పైమూడు, ముప్పై ఆరు సంవత్సరాలుగా సవరించారు. కానీ ఈ ఉపనయనం కేవలం బాలకులకే చెయ్యాలికానీ యువకులకు కాదు; అంటే పదహారవ సంవత్సరంతో యవ్వనంలోకి అడుగుపెట్టినవారు ఉపనయనానికి అనర్హులని జైమిని ధర్మశాస్త్రం కచ్చితంగా చెప్పింది. బ్రాహ్మణులకి వసంత ఋతువులో, రథకారులకు వర్షఋతువు, క్షత్రియులకు గ్రీష్మఋతువు, వైశ్యులకు శర దృతువు అని బోధాయనుడి గృహ్యసూత్రాలు నిర్దేశించాయి. ఉపనయనాన్ని చైత్ర, వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ, మాఘ, ఫాల్గుణ మాసాలలో శుక్ల పక్షాన విదియ, తదియ, పంచమి, షష్ఠి, దశమి, ఏకాదశి తిథులలో, ఆది, బుధ, గురు, శుక్ర వారాలలో, పురుష నక్షత్రాలలో జరిపించాలని శాస్త్రకారులు తెలియజేశారు. ఈ ద్విజులలో ఎవరైతే ఈ ఉపనయన సంస్కారాన్ని వారికి నిర్దేశించిన కాలంలో జరిపించుకోరో, వారిని ధర్మభ్రష్టులుగా పరిగణించి, ఆయా జాతులనుండి వెలివేయాలని మనువు ఘంటాపదంగా సూచించాడు. బ్రహ్మచారికి ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చేవరకు ఆచార్యుని వద్దనే వుండి విద్యను నేర్చుకోవాలని శాస్త్రం. ఒక వేదం చదివినవారు మరొక వేదాన్ని చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకునే సాంప్రదాయాన్ని కూడా కొందరు శాస్త్రకారులు సూచించారు. బ్రహ్మవాదినులైన స్త్రీలకు కూడా ఉపనయనం చేయించే ఆచారమున్నట్లు శాస్త్రకారులు పేర్కొన్నారు. అయితే వారికి రజస్వల కాక ముందే అనగా ఎనిమిదవ సంవత్సరం దాటకుండానే ఉపనయనం చేయించాలని శాస్త్రం. వారికి కూడా వేదాధ్యయనమున్నది. బ్రహ్మవాదినులైన గార్గి, మైత్రి అలనాటి రోజుల్లోనే ఉపనయనం చేయించుకున్నారు. సంస్కార విధానం తారాబలం, చంద్రబలాలతోబాటు, గురుబలం కూడా గల ముహూర్తాన్ని పంచకరహితంగా నిర్ణయించి, శుభముహుర్తాన, గణపతి పూజ పుణ్యహవాచనలను జరిపించి అగ్నిప్రతిష్ఠ చేసి, ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం..’ అనుమంత్రంతో వటువునకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఆచార్యుని చేతులమీదుగా దీక్షా వస్త్రాలు, దండకమండలాలు, అజినం, మేఖలాలు తీసుకుని ధరించి అగ్నికి హవిస్సులు అర్పించాలి. ముహూర్త సమయానికి ఆచార్యుడు ఒక నూతన వస్త్రాన్ని వటువుతోసహా కప్పుకుని, ఎవరికీ వినపడకుండా వటువు కుడిచెవిలో బ్రహ్మోపదేశమంత్రాన్ని పఠిస్తాడు. ఆ తరువాత అగ్నికార్యం, ఇతర శాస్త్ర విధులను నిర్వహించి ఆచార్యుని నుండి బ్రహ్మచర్య దీక్షను తీసుకుని, కార్యక్రమం తర్వాత వస్త్రాలను, దండాదులను మోదుగ చెట్టుయందు విడిచిపెట్టాలి. ఆచార్యునికి గోదానమిచ్చి, వస్త్ర తాంబూలాదులతో సత్కరించాలి. ఆ తరువాత ఆచార్యుడు చెప్పిన బ్రహ్మచర్య వ్రతనియమాలని పాటిస్తూ గురుశుశ్రూష చేయాలి. బ్రహ్మచర్య దీక్షలో ఉన్న బ్రహ్మచారి కచ్చితంగా భిక్షాటనం చేయాలని మనువు ధర్మ శాస్త్రం. పరమ పవిత్రమైన భిక్షను తినడం అంటే ఉపవాసమున్నట్లే లెక్క అని చెప్పారు. ఆ భిక్ష కూడా వేరువేరు ఇండ్లనుండి తీసుకున్నదై ఉండాలి, ఒకే ఇంటినుండి తీసుకోరాదు అని శాసనం. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
బ్రాహ్మణుల సంక్షేమానికి నూతన పథకం
సాక్షి, అమరావతి: పేద బ్రాహ్మణ కుటుంబాల్లో ఉపనయనం (ఒడుగు) చేసుకోవడానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే నూతన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్ణయించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తు జరుగుతోంది. 7–16 ఏళ్ల మధ్య వయసున్న పేద బ్రాహ్మణులు ఉపనయనం చేసుకుంటే ఈ ఆర్థిక సాయం అందజేస్తారు. (చదవండి: పై తరగతులకు పటిష్టమైన అడుగులు) మరోవైపు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బ్రాహ్మణ యువతకు ‘భారతి’ పథకంలో భాగంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 29వ తేదీ వరకు కార్పొరేషన్ వెబ్పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏడాదికి రూ.6 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో ఒక విడత ఆర్థిక సహాయం పొందిన వారు అనర్హులు. కనీసం ఏడాది కాలం మాస్టర్స్ డిగ్రీ చదవడానికి విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రూ.100 కోట్లతో వివిధ పథకాలు అమలవుతున్నాయని, 15 వేల మంది బ్రాహ్మణులకు ప్రతి నెలా పింఛను ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వేదవ్యాస, గాయత్రి, కల్యాణమస్తు, గరుడ, భారతి తదితర పథకాల కింద ఇప్పటిదాకా 22,056 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారందరికీ త్వరలో ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. (చదవండి: మీ చర్యలు స్ఫూర్తిదాయకం) -
హరి సర్వోత్తమ..వాయు జీవోత్తమ
– ఘనంగా నాల్గో రోజు గురు వైభవోత్సవాలు – విశేషంగా ఉపనయనం వేడుక – ఆకట్టుకున్న మూలరాముల సంస్థాన పూజలు మంత్రాలయం : హరి సర్వోత్తమ..వాయు జీవోత్తమ నామంతో శ్రీమఠం మార్మోగింది. వైభవోత్సవాల్లో భాగంగా శుక్రవారం భక్తి వేడుకలు కనుల పండువగా సాగాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో మూలబృందావనంకు పవిత్ర పూజలు గావించారు. పూజామందిరంలో మూల, జయ, దిగ్విజయ రాముల పూజలో పీఠాధిపతి తరించారు. యాగమండపంలో బ్రాహ్మణ చిన్నారులకు ఉపనయనం నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణలు మధ్య ఎంతో కమనీయంగా ఉపనయం కానిచ్చారు. పీఠాధిపతి ఉపనయన చిన్నారులకు శేషవస్త్రం, పూజా సామగ్రి అందజేసి ఆశీర్వదించారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను శ్రీమఠం మాడా వీధుల్లో చెక్క, వెండి, బంగారు, నవరత్న రథాలపై ఊరేగించారు. అనంతరం డోలోత్సవ మండపంలో ఊంజల సేవ, దివిటీ సేవ, హారతి సహిత పూజలు చేపట్టారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆం«ద్ర ప్రాంతాల నుంచి భక్తుల వేలాదిగా తరలివచ్చారు. భక్తుల కోలాహలంతో శ్రీమఠం కనువిందు చేసింది. వేడుకలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, దివాన్ వాదీరాజాచార్, డీఎం ఆనందరావు, ప్రిన్సిపాల్ వాదీరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వార పాలక అనంతస్వామి పాల్గొన్నారు.


