breaking news
Unemployed teachers
-
నిరుద్యోగ ఉపాధ్యాయులకు నిరాశాపాఠం
జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ ఉపాధ్యాయులు శిక్షణ పొందినా దక్కని ఉద్యోగం రేషనలైజేషన్తో మరింత ముప్పు ఏటా భర్తీకాని టీచర్ పోస్టులు చిరుద్యోగులుగా మిగిలిపోతున్న అభ్యర్థులు భావితరాలకు విద్యాబుద్ధులు నేర్పేది ఉపాధ్యాయులే. అందుకే ఆచార్యదేవో భవ ! అన్నారు పెద్దలు. అటువంటి ఉన్నతమైన వృత్తిపై ఉన్న మక్కువతో జిల్లాలో వేలాది మంది ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు. అంతకు ముందు ఇతర కోర్సుల్లో అవకాశం వచ్చినా కాదనుకున్నారు. చివరకు స్థిరపడాలనుకున్న రంగంలో ఉద్యోగం లభించక కుటుంబ పోషణకోసం ప్రయివేటు సంస్థల్లో చిరుద్యోగులుగా మారుతున్నారు. జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణ ముగించుకుని ఏటా ఆరువేల మంది బయటికొచ్చి ఉపాధి వేటలో విసిగివేసారిపోతున్నారు. చిత్తూరు: ఉపాధ్యాయ శిక్షణ ముగించుకుని ఎన్నో ఆశలతో వ్యవస్థలోకి వచ్చే వారికి చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదు. దీంతో వారు నిరాశకు గురవుతున్నారు. మారుమూల మండలాలు గ్రామాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో ఉద్యోగం దొరికినా ఆ యాజమాన్యం ఇచ్చే చాలీచాలని జీతానికి అంగీకరించి వెళ్తున్నారు. ఇళ్లు గడవడం కోసం కొంతమంది సెక్యూరిటీ గార్డులు, వారి కుల వృత్తుల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. మరికొంత మంది వ్యసాయం చేసుకుంటున్నారు. ఇదిలానే కొనసాగితే రాబోయే కాలంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునే వారు ఉండరని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. కొంప ముంచుతున్న ప్రభుత్వ నిర్ణయం... ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు ఉపాధ్యాయ నిరుద్యోగులకు శాపమవుతున్నాయి. టీటీసీ శిక్షణ తీసుకున్న వారు మాత్రమే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులని నిబంధన విధించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. బీఈడీ శిక్షణ తీసుకున్న వారందరూ ఎక్కువ శాతం నిరుద్యోగులుగా మిగులుతున్నారు. టీటీసీ పూర్తి చేసుకున్న వారు ప్రతి సంవత్సరం 2500 మంది. గత 13 సంవత్సరాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసింది 3200 ఉద్యోగాలు మాత్రమే. ఈ 13 సంవత్సరాల్లో 32500 మంది శిక్షణ ముగించుకొని ఉద్యోగ వేటకు వచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న డీఎడ్ కాలేజీలు 51. ఈ కాలేజీల్లో సీట్లు సుమారుగా 7 వేలు. ఈ సీట్లలో కేవలం 4500 మంది మాత్రమే ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నారు. 2500 సీట్లు ఖాళీగా మిగులుతున్నాయి. రేషనలైజేషన్తో... ప్రభుత్వం రేషనలైజేషన్ విధానం అమలు చేస్తే ఉపాధ్యాయ నిరుద్యోగులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉన్న స్కూళ్లను మూసివేస్తుండటంతో కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం విముఖత చూపే అవకాశం ఉంది. దీంతో ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్నా ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది. తమిళనాడు విధానమే మేలు.. టీచర్ ఉద్యోగాల అమలులో తమిళనాడు విధానం మేలని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. కళాశాలలన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటే శిక్షణ బాగుంటుంది. తమిళనాడులో ఉపాధ్యాయ ఉద్యోగాలన్నీ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛేంజ్ ద్వారా భర్తీ చేస్తారు. సీనియార్టీ ఉన్న వారికి ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. ఉపాధ్యాయ నిరుద్యోగి కూడా కచ్చితంగా ఉద్యోగం వస్తుందని ధీమాతో ఉంటాడని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. కొరియర్బాయ్గా పని చేస్తున్నా డీఈడీ పూర్తి చేసి మూడేళ్లయింది. ఈ మూడేళ్లలో కేవలం ఒకసారి టీచర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పని చేద్దామంటే రూ.5 వేల జీతం కూడా ఇవ్వరు. పూట గడవడం కష్టం. కొరియర్బాయ్గా పని చేస్తున్నా. రేషనలైజేషన్ అమలు చేస్తే టీచర్ ఉద్యోగం ఇక దొరకదు. అనవసరంగా డీఎడ్ చేశాను అనిపిస్తోంది. -మహేశ్, చిత్తూరు. సీనియార్టీ విధానం అమలు చేయాలి పరీక్ష విధానం తీసేసి ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసే ప్రక్రియలో సీనియార్టీ ప్రకారం ఉద్యోగాలిస్తే మేలు. నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగం వ స్తుందో ఒక అంచనా ఉంటుం ది. టీచర్ ఉద్యోగం అవసరం అయిన వారు ఎదురు చూస్తారు. అవసరం లేని వారు ఇంకో ఉపాధి మార్గం ఎంచుకుంటారు. ఉపాధ్యాయ పోస్టులు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. -వీ. రెడ్డిశేఖర్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, వైఎస్సార్ టీఎఫ్ -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
పంచపాండవులు ఎంతమందంటే... పంచపాండవులు ఎంతమంది అంటే ఓస్ నాకెందుకు తెలియదు ... మంచం కోళ్లలా ముగ్గురుంటారని చెప్పి నాలుగేళ్లు చూపించాడట వెనుకటికో వ్యక్తి. అలా ఉంది రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట తీరు. సెప్టెంబరు 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. అక్కడితో పరిమితం కాకుండా ఏకంగా 20 వేల టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నిరుద్యోగ టీచర్లు ఇక మాకు ఉద్యోగాలు వచ్చేస్తాయోచ్ అంటూ ఎగిరి గంతేశారు. తరువాత ఆ సంఖ్యను 15 వేలకు కుదించారు ... తాజాగా 10,500 కు చేరింది. ఇక్కడితో ఆగుతుందో ఇంకెంత దిగజారుతుందోనని భయపడుతున్నారు ఆశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులు. ఒంగోలు వన్టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి డీఎస్సీ 2014 ప్రకటిస్తామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం నిరుద్యోగుల టీచర్ల ఆశలపై నీళ్లు చల్లింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఉపాధ్యాయుల నియామకానికి డీఎస్సీ-2014ను ప్రకటిస్తున్నామంటూ గొప్పలు చెబుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు గత రెండు నెలలుగా రోజూ ప్రకటన చేస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 5 వెళ్లి నెలరోజులు కావస్తున్నా ఇప్పటివరకు డీఎస్సీ ప్రకటన విషయంలో అతీగతీ లేదు. డీఎస్సీ-2014కు ప్రకటించే పోస్టుల విషయంలో కూడా స్పష్టత లేదు. మొదట 20 వేల టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. తరువాత ఆ సంఖ్యను 15 వేలకు కుదించారు. ఆ తరువాత అది 10,500కు చేరింది. డీఎస్సీని నిర్వహించే విషయంలో అసలు ప్రభుత్వానికి ఒక స్పష్టత లేకుండా పోయింది. దీంతో నిరుద్యోగ టీచర్లందరూ అయోమయానికి గురవుతున్నారు. గత ప్రభుత్వం డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) పాసై ఉండాలని నిబంధన పెట్టారు. ప్రస్తుతం డీఎస్సీ ఉపాధ్యాయ అర్హతా పరీక్ష రెండూ కలిపే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. దీంతో గతంలో ఉపాధ్యాయ అర్హతా పరీక్ష పాసైన వారి పరిస్థితి ఏమిటని నిరుద్యోగ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హతా పరీక్ష, డీఎస్సీ రాత పరీక్ష రెండింటినీ ఏ సిలబస్ ప్రకారం నిర్వహిస్తారు, ఈ రెండింటిలో దేనికెంత ప్రాధాన్యం ఇస్తారు అనే విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. 30 వేల మంది నిరీక్షణ జిల్లాలో సుమారు 30 వేల మంది నిరుద్యోగ టీచర్లు డీఎస్సీ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం పొంతనలేని ప్రకటనలతో వీరిని అయోమయానికి గురిచేస్తోంది. ప్రకటనపై ఆశతో వేలకు వేలు ఖర్చు పెట్టి శిక్షణా కేంద్రాల్లో చేరి శిక్షణ కూడా పొందారు. కొందరైతే దూర ప్రాంతాలైన అవనిగడ్డ, నంద్యాలకు వెళ్లి శిక్షణ పొందారు. డీఎస్సీకి బీఈడీ మెలిక ప్రభుత్వం డీఎస్సీ ప్రకటనకు బీఈడీ మెలిక పెట్టింది. సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు కేవలం డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ (డిఈడి) పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని గతంలో సుప్రీంకోర్డు తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం గత రెండు డీఎస్సీలలో డి.ఈ.డ.ి అభ్యర్థులను మాత్రమే అర్హులుగా ప్రకటించారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులకు కూడా సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసింది. ఎస్.జి.టి. పోస్టులకు బి.ఈ.డి వారిని కూడా అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆ లేఖకు కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఆ లేఖ సాకు చూపుతూ డీఎస్సీ ప్రకటనను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. జిల్లాలో 839 ఖాళీలు జిల్లాలో ప్రస్తుతం వెయ్యికి పైగా ఉపాధాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 839 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. సెకండ్గ్రేడ్ (తెలుగు) 715, సెకండ్గ్రేడ్ (ఉర్ధు) 8, స్కూలు అసిస్టెంట్లు గణితం 14, బయోలాజికల్ సైన్స్ 14, సోషల్ స్టడీస్ 43, తెలుగు 1, హిందీ 6, ఉర్ధు 1, బాషా పండితులు ఉర్ధు 1, సంస్కృతం 2, హిందీ 13, వ్యాయామోపాధ్యాయులు 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ పాఠశాలల్లో 8, జిల్లా పరిషత్, మండల పరిషత్ యాజమాన్యాలలోని పాఠశాలల్లో 831 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.