ఆ పేలుడుతో ‘తెలుగు లింకులు’ లేవు!
బెంగళూరు బాంబులో దొరికిన తెలుగు దినపత్రిక
అప్పటి నుంచి ఇక్కడి వారి ప్రమేయంపై అనుమానాలు
దాన్ని తానే ఖరీదు చేశానని వెల్లడించిన ఉగ్రవాది అఫ్రిది
సిటీబ్యూరో:బెంగళూరు చర్చ్ స్ట్రీట్లో ఉన్న కోకొనట్ గ్రోవ్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద 2014లో జరిగిన పేలుడులో ‘తెలుగు లింకుల’పై ఉన్న సందేహాలకు తెరపడింది. నాటి బాంబు శకలాల్లో ఓ తెలుగు దినపత్రికకు చెందిన ముక్కలు లభించడంతో ఇక్కడి వారి ప్రవేయం ఉందనే కోణంలో దర్యాప్తు సాగింది. ఎట్టకేలకు ఈ పేలుడికి ఇటీవల పట్టుబడిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది ఆలం జబ్ అఫ్రిది బాధ్యుడని తేలింది. ఆ పత్రికను తానే ఖరీదు చేసి, బాంబు తయారీలో వాడానని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో అఫ్రిది బయటపెట్టాడు. బెంగళూరులోని పరప్పన అగ్రహార ప్రాంతంలో గత నెల ఆఖరి వారంలో తెలంగాణ పోలీసు అధికారిపై హత్యాయత్నం చేసింది కూడా అఫ్రిదీనే అన్న విషయం తెలిసిందే.
వినాయక లేఔట్లో పేపర్ ఖరీదు...
2014 డిసెంబర్ 28న కోకోనట్ గ్లోవ్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పేలుడు జరిగింది. ఈ ఘాతుకంలో ఓ మహిళ మరణించింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన అధికారులకు బాంబు శకలాల్లో ఓ తెలుగు దినపత్రిక (‘సాక్షి’ కాదు) ముక్కల్ని గుర్తించారు. 2013 నుంచి పరప్పన అగ్రహారంలోని వినాయకనగర్ లేఔట్లోని కేటీ అషఫ్క్రు చెందిన ఇంట్లో అఫ్రిదీ అద్దెకుంటున్నాడు. పేలుడు కుట్రను అమలు చేయడానికి కొన్ని రోజుల ముందే స్థానికంగా పేలుడు పదార్థాలు సమీకరించుకున్నాడు. బాంబు పెట్టే రోజు ఉదయం దాన్ని ప్యాక్ చేయడానికి వినాయకనగర్లోని ఓ దుకాణంలో అఫ్రిది ఈ తెలుగు పత్రికను కొన్నాడు.
ప్యాకింగ్కు వినియోగం...
జీఏ పైపుతో తయారైన ఎల్బో (వంపుతో ఉండే భాగం) వినియోగించి అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, పొటాషియం క్లోరైడ్ సమ్మిళిత పదార్థంతో బాంబును తన ఇంట్లోనే తయారు చేశాడు. అందులో కొన్ని ఇనుప మేకుల్ని ఉంచాడు. పేలుడు సంవించినప్పుడు ఆ ధాటికి పైపు ముక్కలై దూసుకుపోతుంది. పైపులో ఉండే ఇనుప మేకులు కూడా అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ఆ పరిధిలో ఉన్న వారి శరీరాలను ఛిద్రం చేస్తాయి. ఎల్బోతో తయారు చేసిన బాంబును తొలుత చేతి రుమాలులో కట్టిన అఫ్రిది దాని పైన తెలుగు దినపత్రిక టాబ్లాయిడ్ ఉంచి పార్శిల్ చేశారు. దీన్ని ప్లాస్టిక్ కవర్లో ఉంచి చర్చి స్ట్రీట్లోని రెస్టారెంట్ దగ్గర వదిలి వెళ్లారు. బాంబు శకలాల్లో ఈ పత్రిక ముక్కల్ని చూసిన దర్యాప్తు అధికారులు ఉగ్రవాదులకు సహకరించిన వారిలో ఎవరైనా తెలుగు రా
ష్ట్రాలకు చెందిన వారు ఉన్నారా? అని అనుమానించారు.
మరో వ్యక్తి కోసం గాలింపు...
వినాయకనగర్ లేఔట్లో కేవీ అషఫ్ ్రఇంటిని నెలకు రూ.3,200 చొప్పున అద్దె చెల్లించేలా, రూ.20 వేల అడ్వాన్స్తో అఫ్రిది అద్దెకు తీసుకున్నాడు. ఇంటి యజమానిని విచారించిన ఎన్ఐఏ అధికారులు ఆరు నెలల క్రితం వరకు అఫ్రిదితో మరో వ్యక్తి ఉన్నాడని గుర్తించారు. దీంతో అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. బెంగళూరులోని ఎంబీ రోడ్లో ఉన్న ఇజ్రాయిల్ వీసా సెంటర్కు 2015 డిసెంబర్ 1న దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడిందీ అఫ్రిదిగా ఎన్ఐఏ ప్రాథమికంగా నిర్థారించింది. వీసా సెంటర్లోని సీసీ కెమెరాలు రికార్డైన ఫీడ్లోని అనుమానితుడి కదలికల్ని, అఫ్రిదితో సాంకేతికంగా పోల్చి చూసి ఈ నిర్ణయానికి వచ్చింది. త్వరలో ఈ కేసులోనూ అరెస్టు ప్రకటించనుంది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్ఐఏ కస్టడీలో ఉన్న అఫ్రిదిని బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో తిప్పిన అధికారులు పలు కీలకాధారాలు సేకరించారు.
సిటీకి గిడ్డా అజీజ్ నేడు నాంపల్లి కోర్టులో హాజరు!
సిటీబ్యూరో: సౌదీ అరేబియాలోని జిడ్డా నుంచి ఉత్తరప్రదేశ్లోని లక్నోకు డిపోర్ట్ అయిన అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ను సీసీఎస్ ఆధీనంలోని సిట్ అధికారులు గురువారం సిటీకి తీసుకొచ్చారు. సిట్లో నమోదై ఉన్న కుట్ర, అక్రమ ఆయుధాల కేసుకు సంబంధించి శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. అజీజ్ సహా అతడి అనుచరుల్ని 2001 ఆగస్టు 28న అరెస్టు చేసిన పోలీసులు విధ్వంసాలకు కుట్ర పన్నినట్టు అభియోగాలు మోపారు. అరెస్టు సమయంలో పోలీసులు నకిలీ పాస్పోర్ట్తో పాటు బెల్జియం తయారీ తుపాకీ, పేలుడు పదార్థాలు, రెచ్చగొట్టే సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీ అరేబియాకు పారిపోయాడు. దీంతో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. శుక్రవారం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. 2004 నాటి సికింద్రాబాద్లో ఉన్న గణేష్ ఆలయం పేల్చివేతకు కుట్ర కేసు సీఐడీ దర్యాప్తులో ఉండటంతో ఆ అధికారులు పీటీ వారెంట్పై అరెస్టు చేయనున్నారు.