telugu dramas
-
పదో తరగతి పరీక్షలకు 19,015 మంది హాజరు
ముమ్మిడివరం: పదో తరగతికి శుక్రవారం జరిగిన బయోలజికల్ సైన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 22 మండలాల్లో 110 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 19,133 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 19,015 మంది హాజరయ్యారు. 118 మంది గైర్హాజరయ్యారు. 18,934 మంది రెగ్యులర్, 81 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 99.38 శాతం మంది పరీక్షలకు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా తెలిపారు. డీవైఈవో జి.సూర్యప్రకాష్ ప్రభుత్వ పరీక్షల విబాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావుతో పాటు ఐదు ప్లయంగ్ స్క్వాడ్లతో డీఈఓ జిల్లాలో మొత్తం 24 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేశారు.సర్వేశ్వరశర్మకు సైన్స్ పాపులరైజేషన్ అవార్డుఅమలాపురం టౌన్: కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు, అమలాపురం వాసి డాక్టర్ సీవీ సర్వేశ్వరశర్మ సైన్స్ పాపులరైజేషన్ పురస్కారానికి ఎంపికయ్యారు. హైదరాబాద్ అకాడమి ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డాక్టర్ సర్వేశ్వరశర్మకు ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ నుంచి ఆయనకు లిఖితపూర్వక సమాచారం అందింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఈ అవార్డుకు ఆయన ఒక్కరే ఎంపికయ్యారు. వచ్చే ఏప్రిల్ 22న హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటరు భాస్కర ఆడిటోరియంలో జరిగే ఆ సంస్థ వార్షికోత్సవ సభలో శర్మ ఈ అవార్డును అందుకోనున్నారు.అమలేశ్వరికి వెండి ఆభరణాల సమర్పణఅమలాపురం రూరల్: మండలం రోళ్లపాలెంలో కొలువైన అమలేశ్వరీ సమేత అమలేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి భక్తులు వెండి ఆభరణాలను సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సూమారు రెండులక్షలతో తయారు చేసిన కిరీటం, దండ, హారం, ముక్కపుడక, కళ్లు, కనుబొమ్మలు తదితరులు ఆభరణాలను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వాటిని అమ్మవారికి అలకరించారు. హోమం నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమాధనఅధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.రేపటి నుంచి సీఆర్సీ ఉగాది నాటికల పోటీలురావులపాలెం: ఉగాది సందర్భంగా రావులపాలెం కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ) కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో 25వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలను నిర్వహిస్తున్నట్టు సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి వీరరాఘవరెడ్డి తెలిపారు. సీఆర్సీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 30, 31, ఏప్రిల్ ఒకటో తేదీల్లో ఏడు నాటికలు, సీఆర్సీ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆదివారం నృత్య ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ ఏడాది కాటన్ కళా పురస్కారాన్ని సినీ నటుడు తనికెళ్ల భరణికి అందిస్తామన్నారు. 30వ తేదీన తాడేపల్లి వారి అరవింద్ ఆర్ట్స్ విడాకులు కావాలి నాటిక, అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి చిగురు మేఘం నాటిక, 31న విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి స్వేచ్ఛ నాటిక, మైత్రి కళానిలయం విజయవాడ వారి బ్రహ్మ స్వరూపం నాటిక, మిత్ర క్రియేషన్స్ హైదరాబాద్ వారి ఇది రహదారి కాదు నాటిక, ఏప్రిల్ 1న సహృదయ ద్రోణాదుల బాపట్ల వారి వర్క్ ఫ్రమ్ హోమ్ నాటిక, శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరి వారి జనరల్ బోగీలు నాటిక, సీఆర్సీ వారి ప్రత్యేక ప్రదర్శన అలా ఎలా? నాటికలు ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అనంతరం నాటికల ప్రదర్శనలకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాపరిషత్ డైరెక్టర్లు కె.సూర్య, పడాల సత్యనారాయణరెడ్డి, సత్తి సూర్య భాస్కరరెడ్డి (చిన్నబుజ్జి), కె.రంగనాయకులు, సింగంశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
మూస ధోరణికి భిన్నంగా..
ఒక జాతి సంస్కృతి తెలుసుకోవాలంటే.. ఆ జాతి ఏర్పాటు చేసుకున్న రంగస్థలమేంటో తెలుసుకుంటే సరిపోతుందంటారు సామాజికవేత్తలు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలు, సమకాలీన సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో చూపడంలో రంగస్థలం అత్యంత ప్రధానమైంది. నలభయ్యేళ్లుగా ప్రవాహంలా సాగిపోతున్న నాటక రంగానికి తమవంతు బాధ్యతగా దశాదిశ చూపే ప్రయత్నం చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు (Thorrur) ప్రాంత కళాకారులు.తొర్రూరు ప్రాంతానికి చెందిన చైతన్య కళా సమాఖ్య ప్రతినిధులు 1985 నుంచి నాటక రంగానికి జీవం పోస్తున్నారు. నాటక ప్రదర్శనల్లో.. తెలుగు రాష్ట్రాల్లోనే చైతన్య కళా సమాఖ్య మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 200 పైచిలుకు నాటక ప్రదర్శనలకు అవకాశమిచ్చిన కళా సమాఖ్య.. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ గుర్తింపు పొందుతోంది. ఆదర్శం.. చైతన్య కళా సమాఖ్య నాటక సేవ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 1985లో మన్నూరు ఉమ బృందం చైతన్య కళా సమాఖ్యను స్థాపించింది. అప్పటినుంచి సమాఖ్య 40 ఏళ్లుగా కళా రంగానికి తన వంతు సేవ చేస్తోంది. ఏటా మార్చిలో వారం రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ జాతీయ తెలుగు ఆహ్వాన నాటికల పోటీల్లో.. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక నాటక సంఘాలు ప్రదర్శనలిచ్చాయి. హైదరాబాద్, కరీంనగర్, గుంటూరు కళాకారులు నాటకాలను ప్రదర్శించారు. ఈ కళా సమితి వేదికపై ప్రదర్శనలు ఇచ్చి పలువురు గుర్తింపు పొందారు. మూస ధోరణికి భిన్నంగా.. 1980 వరకు గ్రామాల్లో, పట్టణాల్లో పండుగల సందర్భాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవారు. వాటికి విపరీతమైన ఆదరణ ఉండేది. ఒకప్పుడు వెలుగొందిన ఈ కళ.. నేడు సినిమా, టీవీల ప్రభావంతో మసకబారుతోంది. ప్రస్తుతం నాటక ప్రదర్శనలకు పెద్దలు మినహా నేటితరం యువత రావడం లేదు. ఇలాగే కొనసాగితే తెలుగు నాటకం (Telugu Natakam) మసకబారే ప్రమాదముందని భావించిన తొర్రూరు చైతన్య కళా సమాఖ్య కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఉత్తమ నాటకాలను ఎంచుకుని ప్రదర్శనలకు ఆహ్వానిస్తోంది. పోటీకి వచ్చిన నాటికల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేస్తోంది. ఉత్తమ నటులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.చదవండి: దేవాలయాల్లో రావి, వేప చెట్లు ఎందుకు ఉంటాయి?నాటక వారసత్వాన్ని కొనసాగించాలని.. ప్రస్తుతం టీవీ, సినిమాలు చూస్తే.. వాటిలో ఎలాంటి సందేశం ఉండటం లేదు. కానీ నాటకాలను తిలకించినప్పుడు.. అందులోని పాత్రలు, సారాంశం నిజ జీవితానికి అద్దం పట్టేలా ఉంటాయి. నాటకాల వారసత్వాన్ని నేటి తరానికి అందించే లక్ష్యంతో చైతన్య కళా సమాఖ్య ఏటా పోటీలు నిర్వహిస్తోంది. కళా సమాఖ్య ద్వారా తొర్రూరులో మా వంతుగా కళా రంగాభివృద్ధికి కృషి చేస్తున్నాం. – మన్నూరు ఉమ, అధ్యక్షుడు, చైతన్య కళా సమాఖ్య, తొర్రూరునాటకానికి జవసత్వాలు నింపాలి ప్రాచీన కళలు అంతరించి పోకుండా ఐక్యంగా కృషి చేయాలి. నాటక పోటీల ద్వారా ఈ రంగానికి జవసత్వాలు నిండాలన్నదే మా ఆకాంక్ష. ఇటీవల తొర్రూరులో నిర్వహించిన జాతీయ స్థాయి తెలుగు ఆహ్వానిత నాటక పోటీలకు ఎన్నడూ లేనంత ఆదరణ లభించింది. ప్రేక్షకులు నాటకాలు వీక్షించేందుకు గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోయారు. రానున్న రోజుల్లోనూ నాటక ప్రదర్శనలు కొనసాగిస్తాం. – సుంకరనేని పినాకపాణి, ప్రధాన కార్యదర్శి, చైతన్య కళా సమాఖ్య -
సవాలుగా మారిన సరికొత్త నాటకం ‘నచికేత’
సవాళ్ళు ఎదురైనప్పుడే సృజనాత్మకత మరింత రాటుదేలుతుంది. నాటక రచయితగా మొదలై, సీరియల్స్ నుంచి సినిమా రచయితగా ఎదిగిన నాకు ఆ సంగతి అనుభవైకవేద్యం. ‘నరవాహనం’ నాటకం నుంచి ‘రంగమార్తాండ’ చిత్రం, తాజా ‘కన్నప్ప’ సినిమా వరకు రచనలో క్లిష్టమైన సందర్భాలు ఎదురైనప్పుడల్లా నాలోని రచయిత రాటుదేలడానికి అది దేవుడిచ్చిన అవకాశంగా భావించాను. రంగస్థలంపై ఇటీవల నాకు అలాంటి ఓ కొత్త సవాలు – ‘నచికేత’ నాటకం. ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా, రసరంజని 31వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆచార్య కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో ‘నచికేత’ నాటకాన్ని ప్రదర్శించాం. భారతీయ ఉపనిషతుల్లో సుప్రసిద్ధమైన కఠోపనిషత్తులోది నచికేతుడి కథ. సాక్షాత్తూ మృత్యుదేవత యముడే నచికేతుడికి బోధించిన మరణరహస్యం ఇందులోని ప్రధాన అంశం. ‘నచికేతుడి’ కథను నాటకంగా మలిస్తే బాగుంటుందనేది కోట్ల హనుమంతరావు ఆలోచన. ఆ ఆలోచన ఆయన నాతో పంచుకున్నప్పుడు ఉపనిషత్ రహస్యాన్ని నాటకంగా ఎలా మలచాలి అనేది పెద్ద సవాలుగా మారింది. ఈ విషయంపై లోతుగా చర్చించాం. నాటక రచన ప్రయత్నంలో భాగంగా పలు పుస్తకాలను తిరగేయడం మొదలుపెట్టాను. మొదటగా రామకృష్ణమఠం వారు ప్రచురించిన స్వామి స్వరూపానంద గారి ‘ఉపనిషత్ కథలు’, ‘ఆర్ష విద్యాతరంగాలు’ ప్రచురణ, స్వామి పరమార్థనంద గారి కఠోపనిషత్తు, విఎస్ఆర్ మూర్తిగారి ‘ఉపనిషత్ సుధ’ చదవడం మొదలెట్టాను. ఉపనిషత్తులోని లోతైన విషయం అర్థమమయింది గానీ, దాన్ని ఎలా చెప్పాలో అంతుచిక్కలేదు. యథాతథంగా రాస్తే పండితులకూ, మేధావులకూ, కేవలం ఈ విషయంపై ఆసక్తిగలవారికి మాత్రమే అర్థమవుతుంది. అలా కాకుండా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రాయడం ఎలా అని ఆలోచించాం. అప్పటికీ నాటకీయంగా ఈ విషయం ఎలా అందించాలి అనే అంశంపై ఆలోచనలు కొలిక్కిరాలేదు. సంప్రదాయ పద్ధతిలో ఉపనిషత్తులు గురుశిష్య సంవాదరూపంలో వున్నాయి గనుక అదే పద్ధతిని అనుసరించి నాటక రచన చేస్తే, స్పష్టమైన అంశాలను సంభాషణలుగా రాస్తే నాటకీయత ఎలావున్నా విషయాన్ని సులభంగా అందించినట్టవుతుందని, గురువు - శిష్యుల ఫార్మెట్ని అనుసరించి ఈ నాటక రచన మొదలుపెట్టడం జరిగింది. అయితే, కేవలం సంభాషణలు మాత్రమే రాస్తే శ్రవ్య నాటికగా ఉంటుందేమోగానీ, దృశ్యనాటికగా ఎలా రక్తికడుతుంది? అదీ సంశయం. దాంతో, కచ్చితంగా దృశ్య రూపకంగా అందించాలని నిర్ణయించుకున్నాం. పదేపదే ఆ కథను చదివితే కొన్ని దృశ్యాలు వచ్చాయి. ఆ దృశ్యాలకు పొందికైన రూపమివ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు మరో సందేహం వెంటాడింది. చాలా విషయాలు జటిలంగా ఉన్నప్పుడు నృత్యరూపకంగా అందిస్తే, కొన్ని హావభావాలను బాగా అందించే అవకాశం వస్తుందని నృత్యనాటిక రూపంలో మొదట రాశాను. దర్శకులు కోట్ల హనుమంతరావు అది చదివి బాగుందనుకున్నా, కేవలం నృత్యరూపకంగా అందిస్తే ‘నాటకీయత’ లోపించే ప్రమాదం ఉందంటూ నాటకంగా రాయమన్నారు. వెరసి, నృత్యరూపకంలో ఉన్న అంశాల్లో కొన్ని నాటకరూపంలోకీ వచ్చాయి. మళ్ళీ మరో సందేహం! నృత్యరూపకం, నాటకరూపం - రెండూ చదివాను. ఆ క్రమంలో ప్రస్తుత సమాజానికి ఈ కథ ద్వారా సందేశం ఏమైనా ఉందా అని ఆలోచనలో పడ్డాను. కేవలం సందేశాలకే నాటకాలు పరిమితం అయిపోవాలన్న భావన లేకపోయినా, ఉపనిషత్తు ఆధారంగా అందులోని కథను నాటకంగా రాసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎందరో ఋషులు, దార్శనికులు అన్ని కాలాలలో దర్శించిన విశ్వజనీన సత్యాలకు నాటకరూప మిస్తున్నప్పుడు, దేశ కాలాతీతంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఉపనిషత్ సారాన్ని, వర్తమాన సమాజానికి అన్వయించే ప్రయత్నం చేస్తే వస్తుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు రూపం ఇవ్వడానికి ప్రయత్నించాను. నృత్యరూపకాన్నీ, నాటకాన్నీ కలిపి, నాటకీయతను జోడించి రచించడం జరిగింది. చివరకు చిన్నచిన్న పాటలను, శ్లోకాలను కలిపి ‘నచికేత’ నాటకం రాయడం జరిగింది. ఒక కొత్త నాటకం రచన, ప్రొడక్షన్ వెనుక ఇంత కథ నడించింది. మరో విషయం... ఈ నాటకం తయారు అవుతున్నప్పుడు స్వామి కృష్ణానంద ‘కామెంట్రీ ఆన్ కఠోపనిషత్’, వేద సమితి ఉపనిషత్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎండ్ ఉపనిషత్ పుస్తకాలను కూడా చదవడం జరిగింది. చివరి నిముషంలో సాధ్యమైనన్ని మార్పులు చేసుకుంటూ ఈ నాటక ప్రదర్శన జరిగింది. ఈ ‘నచికేత’ నాటకాన్ని రసరంజని వారి నిర్వహణలో తొలిసారిగా ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడు ప్రదర్శించడం ఆనందం కలిగించింది. నాటకంలో భాగంగా నచికేతుడు యమపురికి వెళ్ళే మార్గం, మరణానంతరం ఆత్మ జ్యోతులుగా సాగిపోవడం, యమధర్మరాజు - నచికేతుల మధ్య సంభాషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. కథను సమకాలీన పరిస్థితులకు అన్వయించే ప్రయత్నంలో ‘ప్రాయో మార్గాన్ని’ అనుసరించిన వ్యక్తి , అతని ప్రవర్తన, ‘మృత్యువు’ను పర్సానిఫై చేసిన వైనం ప్రదర్శన తిలకించినవారిని ఆకర్షించాయి. ఎంతటి జటిలమైన అంశాన్నయినా సరళంగా అందించే ప్రయత్నం చేస్తే, సహృదయులైన ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని అర్థమైంది. గత 31 సంవత్సరాలుగా నాటకరంగానికి విశేషమైన సేవలు అందిస్తున్న ‘రసరంజని’ చొరవ తీసుకుని, ఒక విభిన్న అంశంతో కూడిన నాటకానికి వేదిక కల్పించడం ఆనందం. అదే విధంగా, కేవలం టి.వీలకి, సిన్మాలకి పరిమితం కాకుండా, ప్రత్యక్షంగా నాటకం చూడడానికి దూరప్రాంతాల నుంచి సైతం ప్రేక్షక దేవుళ్ళు రావడం సంతోషం. తెలుగు రంగస్థలం మరింత ముందుకు సాగడానికి మరిన్ని కొత్త ప్రయత్నాలు కావాలి, రావాలి. ఆ క్రమంలో మా ‘నచికేత’ ఓ చిరు ప్రయత్నం. - ఆకెళ్ళ శివప్రసాద్, ప్రముఖ నాటక – సినీ రచయిత -
ఆటాడుకుందామా!
మీ ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతోందా... అయితే ఆటలు ఆడించే ఎడ్ల సతీశ్ కుమార్ను పిలవండి మరింత సందడి మీ ముందుంటుంది. గోళీలు, కర్రబిళ్ల, గాలిపటాలు, దాండియా కర్రలతో మీ ఇంటి ముందు ప్రత్యక్షమవుతారు.. మీ ఇంటికి వచ్చిన అతిథులను ఆటపాటలతో ముంచెత్తి, పండుగ వాతావరణం తీసుకువస్తారు. రంగస్థల నటుడు, సంప్రదాయ ఆటలలో నిష్ణాతుడు, జానపద గిరిజన నృత్యాల నిపుణుడు అయిన సతీశ్కుమార్ దేశవిదేశాలలో భారతదేశ సంప్రదాయాన్ని ప్రదర్శిస్తున్నారు. మరుగున పడిపోతున్న ఆటలను, వస్తువులను నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. సంప్రదాయ ఆటలతోపాటు, జానపద నృత్యాలు, దాండియా ఆటలతో ఇంటిని ఆనంద సాగరంలో ముంచుతున్నారు. భారతీయ సంప్రదాయాన్ని దేశవిదేశాలలో ప్రచారం చేస్తున్న హైదరాబాద్కు చెందిన సతీశ్కుమార్ను ‘సాక్షి’ పలకరించింది. ఆ వివరాలు... నానమ్మ ప్రభావం... ‘చిన్నప్పుడు నానమ్మ చాలా కథలు చెప్పేది. రాముల వారి గుడి దగ్గర రామ్లీల, ఒగ్గు కథలు, నాటకాలు అన్నిటికీ నానమ్మ తనతో తీసుకువెళ్లేది. అవి చూస్తుండటం వల్ల కళల పట్ల మక్కువ పెరిగింది. 1995 ప్రాంతంలో ఉర్దు, తెలుగు నాటకాలు వేయడం ప్రారంభించాను. సాగర సంగమం సినిమా చూసిన తరవాత నాట్యం నేర్చుకోవాలనుకున్నాను. కూచిపూడి నాట్యకారిణి ఉమారామారావుగారి శిష్యుడైన అనిల్ కుమార్ గారి దగ్గర కూచిపూడి నేర్చుకున్నాను. ఆ తరవాత లంబాడా, కోయ, గోండు వంటి జానపద, గిరిజన నృత్యాలు నేర్చుకుని, వాటిని ఒక పద్ధతిలో రూపొందించి వారి చేతే నాట్యం చేయించడం ప్రారంభించాను. దేశమంతా తిరిగి, అన్ని రాష్ట్రాల జానపదాలు తెలుసుకున్నాను. శివగంగ నాట్యం సుమారు వంద ప్రదర్శనలిచ్చాను. హాంగ్కాంగ్లో 1980లో పది రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో మన దేశం నుంచి నేను ప్రతినిధిగా హాజరయ్యాను. ఇదే నా మార్గం... నేను ఈ కళలలో ఉండటం నాన్నగారికి ఇష్టం లేదు. ఏదో ఒక ఉద్యోగం చేసుకోమనేవారు. నానమ్మ మాత్రం నన్ను ప్రోత్సహించేది. నాన్నకు కోపం రాకుండా ఉండటం కోసం ఉదయం నాలుగు గంటలకే టాంక్బండ్కి వెళ్లి, అక్కడ సాధన చేసి, ఆరు గంటలకల్లా డాన్స్ క్లాసుకి వెళ్లేవాడిని. అలా పట్టుదలతో నాట్యం నేర్చుకున్నాను. అప్పట్లోనే నాటకాలు కూడా వేయడం మొదలుపెట్టాను. 1996లో హాంగ్కాంగ్, 1997లో అమెరికా వెళ్లాను. అక్కడ కార్యక్రమాలకు వివిధ దేశాల ప్రతినిధులు వచ్చారు. వారంతా నన్ను ప్రోత్సహించి, ఆటా సభలకు పంపారు. అక్కడి వారికి మన సంప్రదాయ నృత్యాలు నేర్పించి, ఆటా ప్రారంభోత్సవ వేడుకలో చేయించాను. అలా అక్కడ సభలలో కొత్త ఒరవడి మొదలుపెట్టాను. అక్కడ ‘తెలుగు దేశం మనది’ ప్రదర్శన చూసి, కార్యక్రమానికి హాజరైన పన్నెండు వేల మంది ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారు. ఒక కళాకారుడికి ఇంతకంటె ఏం కావాలి. అప్పుడు అనుకున్నాను, ‘ఇదే నా మార్గం’ అని. అక్కడ రెండేళ్లు ఉండి భారతదేశానికి వచ్చేశాను. స్వదేశంలో కొత్తగా... మన దేశంలో కొత్తగా ఏదైనా క్రియేట్ చేయమని తెలంగాణ కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణగారు కోరారు. ‘ఈ తరం వారు మరచిపోతున్న మన ఆటలు నేర్పిస్తాను’ అన్నాను. ఆయన ‘సరే’ అన్నారు. 2017లో మన ఊరి ఆటలు (ఎథ్నిక్ గేమ్స్) పేరున మరుగున పడిపోతున్న ‘కర్ర – బిళ్ల, గోళీలు, బొంగరాలు, కర్ర సాము, వామన గుంటలు, గచ్చకాయలు, చింత గింజలు’ వంటి ఆటలు ఆడించడం మొదలుపెట్టాను. అలాగే పిల్లలకి రాజస్థానీ తలపాగాలు కట్టి, వారితో దాండియా ఆడిస్తాను. వాతావరణాన్ని ఏభై ఏళ్ల క్రితం ఉన్న సంప్రదాయాల్లోకి తీసుకెళ్తాను. మన సంప్రదాయం తెలిసిన నానమ్మలను, అమ్మమ్మలను పిలిచి, వారితో తిరగలిలో బియ్యం పోసి విసిరిస్తాను. రోట్లో వడ్లు వేసి దంపిస్తాను. మనవలకి, పిల్లలకి వాళ్లు నేర్పేలా చేస్తారు. సంప్రదాయాన్ని నిత్యనూతనంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. మన సంప్రదాయాలను ఆంగ్లంలో... విదేశాలలో ప్రదర్శనలిస్తున్నప్పుడు... బతుకమ్మ, గొబ్బెమ్మ, లంబాడీ, భాంగ్రా వీటికి సంబంధించిన పాటలను ఆంగ్లంలోకి అనువదించి, పాడుతూ చెబుతాను. గుంటూరు జేకేసీ కళాశాలలో సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ కార్యక్రమాల సందర్భంగా ఆడించాను. సంక్రాంతి సంబరాలు జరిపించాను. ‘అహం భారతీయం’ లో హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు అన్నీ కలిసి 1998లో ప్రదర్శించాం. నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని అనను కాని, ఆనందంగా ఉంటుంది. మమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అలాగే మాలాంటి వాళ్లకు శాశ్వత ఉపాధి కలిపిస్తే మరింత బాగా చేయగలుగుతాం. – సంభాషణ: వైజయంతి పురాణపండ – ఫొటోలు: నోముల రాజేష్ రెడ్డి కిల్లింగ్ వీరప్పన్లో, ఆత్మసమర్పణ్ (హిందీ సినిమా)లో, కొన్ని హిందీ సీరియల్స్లోను నటించాను. వచ్చిన ఏ అవకాశాన్నీ విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకుంటున్నాను. ‘ఒకసారి బిర్యానీ దొరికితే, ఒకసారి టీ కూడా దొరక్కపోవచ్చు. నేను కళాకారుడినని తెలిసి, అమెరికాలో ఒకసారి చార్టర్ విమానాన్ని గంటసేపు నా కోసం ఆపారు. ఒకసారి ఒక పెద్ద కార్యక్రమానికి మూడు లారీల సామాను తెచ్చాను. ఎడ్ల బండి, గంగిరెద్దు, భోగి మంటలు అన్నీ ఉన్నాయందులో. పెద్దలతో ఆటలు, అమ్మలక్కలాటలు సైతం ఆడించాను. – ఎడ్ల సతీశ్ కుమార్ -
నాటకంతో ఆత్మసంతృప్తి
తిరుపతి : చిన్న చిన్న డ్రామాలే ఆయన్ని నటన వైపు మళ్లించాయి. దీంతో ఆయన ఆ రంగాన్నే వృత్తి,ప్రవృత్తిగా మార్చుకున్నారు. అగ్రస్థానంలో నిలిచారు. దీంతో రంగస్థలమే ఆయన ఇంటి పేరుగా మారింది. ఆయనే నాయుడు గోపి. నంది నాటకాలకు వచ్చిన సందర్భంగా ఆయనతో ముఖాముఖి. ప్ర: నాటకరంగంలో ప్రవేశం ఎలా జరిగింది. జ : మాది గుంటూరు జిల్లా పెద్దకాకాని గ్రామం. చదువుకునే రోజుల్లో చిన్నచిన్న డ్రా మాలు వేసి, బహుమతులు సాధించాను. అలా నాకు నాటక రంగంపై ఆసక్తి ఏర్పడిం ది. 1980లో గుంతకల్లులో రైల్వేశాఖ నిర్వహించిన నాటక పోటీల్లో తొలి ప్రదర్శనకు అవార్డు వచ్చింది. ఆ స్ఫూర్తితో నాటక రం గంలో కొనసాగుతున్నాను. ప్ర: సినీ అవకాశాలు ఎలా దక్కాయి? జ : హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రదర్శించిన హింసధ్వని నాటికకు మంచి స్పంద న వచ్చింది. దీంతో పరుచూరి బ్రదర్స్ ద్వారా 1996లో సింగన్న సినిమాలో తొలి అవకాశం వచ్చింది. ప్ర: సినిమా, నాటకానికి మధ్య వ్యత్యాసం? జ : నాటక ప్రదర్శనతో ఆత్మసంతృప్తి కలుగుతుంది. సినిమాతో అది ఉండదు. ప్రేక్షకుల ఎదుట ఆత్మ సంతృప్తి కోసం సొంత డబ్బు వెచ్చించి ప్రదర్శించేది నాటకం. సంపాదన కోసం నటించేది సినిమా. ప్ర: నాటక రంగానికి మీరు చేస్తున్న కృషి? జ: తల్లిదండ్రు లు నాకు జన్మని చ్చారు. నాటకరంగం జీవితాన్నిచ్చింది. నాకు జీవితాన్నిచ్చిన ఈ నాటక రంగం రుణం తీర్చుకోవడానికి నావంతు కృషి చేస్తున్నా. అందులో భాగంగానే 1990లో గంగోత్రి సంస్థను స్థాపించి నాటక రంగాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తున్నాను. ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా 25ఏళ్లలో 73 నాటకం, నాటికలను ప్రదర్శించాం. ప్ర: మీకు ఎన్ని నంది అవార్డులు అందుకున్నారు జ: నంది నాటకోత్సవాల్లో వ్యక్తిగతంగా ఉత్తమ దర్శకుడిగా 7, ఉత్తమ నటుడిగా 6 బంగారు నందులతో సహా 1998 నుంచి ఇప్పటి వరకు 37 అవార్డులు వచ్చాయి.